
టీమ్ ఇండియా మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ను ఏకపక్షంగా ఓడించి వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టులోని ప్రతి ఆటగాడు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.
సాధారణంగా ప్రపంచకప్ విజేతలుగా తిరిగొచ్చే ఆటగాళ్లకు ఎయిర్పోర్ట్లలో ఘన స్వాగతం లభిస్తుంది. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ఒక ఆటగాడు మాత్రం ఎవరూ గుర్తించకుండా నిశ్శబ్దంగా ట్రైన్లో ఇంటికి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫైనల్ హీరో శివమ్ దూబే..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ శివమ్ దూబే అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతని వేగవంతమైన ఇన్నింగ్స్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. అయితే విజయం తర్వాత అతను విమానం కాకుండా ట్రైన్లో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
విమానం కాకుండా ట్రైన్ ఎందుకు?
రిపోర్టుల ప్రకారం, ఫైనల్ మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే శివమ్ దూబే తన భార్య, ఒక స్నేహితుడితో కలిసి ముంబైకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని విమాన టికెట్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి. దీంతో అతనికి విమానంలో ప్రయాణించే అవకాశం దొరకలేదు.
ఇలాంటి పరిస్థితిలో అతను ట్రైన్లో వెళ్లాలని నిర్ణయించాడు. కానీ ఫస్ట్ ఏసీ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో చివరికి థర్డ్ ఏసీ కోచ్లో మూడు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం ప్రారంభించాడు.
ట్రైన్లో తనను గుర్తుపట్టకుండా ఏం చేశాడంటే?
అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు శివమ్ దూబే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను క్యాప్ ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్లో అభిమానులు ఎక్కువగా ఉండటంతో తన భార్య, స్నేహితుడిని ముందుగా పంపించి, ట్రైన్ బయలుదేరే ఐదు నిమిషాల ముందు ప్లాట్ఫారమ్కు చేరుకున్నాడు.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
ట్రైన్లో ఎక్కిన తర్వాత పై బెర్త్పై పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు. టికెట్ చెకర్ అతని పేరు చూసి ఆశ్చర్యపోయినా, అతని భార్య అది క్రికెటర్ శివమ్ దూబే కాదని చెప్పడంతో విషయం అక్కడితో ముగిసింది.
కుటుంబాన్ని త్వరగా కలవాలనే ఆతృత..
చివరికి ఎవరూ గుర్తించకుండా శివమ్ దూబే సురక్షితంగా ముంబై చేరుకున్నాడు. బోరివలి స్టేషన్ వద్ద గుర్తించే అవకాశం ఉండటంతో స్థానిక పోలీసులను సంప్రదించగా వారు అతనికి సహాయం చేశారు. తన పిల్లలను త్వరగా కలవాలనే ఆతురత కారణంగానే ఇలా త్వరగా ఇంటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు దూబే వెల్లడించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..