
హైదరాబాద్, మార్చి 10: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత, ఆయుష్ మెడికల్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2026) పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 8తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువును రేపటి వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది.
నీట్ యూజీ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ 2026కు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు మార్చి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీయే అవకాశం కల్పించింది. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎన్టీయే తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీతో సైన్స్లో గ్రూప్లో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇక నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్ట్లో దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో జరగనుంది. ఇతర సందేహాలకు 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది.
నీట్ యూజీ 2026 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.