
టీ కొట్టు దగ్గర ఐదు రూపాయల నుంచి రెస్టారెంట్లలో వేల రూపాయల బిల్లుల వరకు అంతా డిజిటల్ మయమే. అయితే, అస్సలు ఫోన్ వాడకుండా కేవలం నోట్లతోనే వారం రోజులు గడపాలని అనుకుంటే? ఆ అనుభవం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ప్రస్తుతం భారతీయ నగరాల్లో డిజిటల్ చెల్లింపులపై మనం ఎంతలా ఆధారపడి ఉన్నామో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది.
చిల్లర కష్టాలు..
వంద, రెండు వందల నోట్లతో వాలెట్ నింపుకుని బయలుదేరితే అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటే అది పొరపాటే. అసలు కష్టం ఆటో ఎక్కినప్పుడే మొదలవుతుంది. ఆటో డ్రైవర్కు నగదు ఇస్తే, అతను ఇచ్చే రియాక్షన్ వింతగా ఉంటుంది. “అయ్యా! ఈ రోజుల్లో కూడా క్యాష్ ఎవరు వాడుతున్నారు?” అనే ప్రశ్న ఎదురవుతుంది. సరైన చిల్లర లేక డ్రైవర్లు, ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు చిల్లర కోసం పక్కనే ఉన్న షాపుల చుట్టూ తిరగడం లేదా వేరే వాళ్ల మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని కోరడం వంటి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
కేవలం ప్రయాణాల్లోనే కాదు, మెడికల్ షాపులు, కిరాణా స్టోర్లలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఉండే కౌంటర్ల వద్ద చిల్లర కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెస్టారెంట్లలో అందరూ కలిసి తిన్నప్పుడు టేబుల్ మీద డబ్బులు వేసేవారు. కానీ ఇప్పుడు అందరూ సెకన్లలో ఫోన్ ద్వారా బిల్లు సెటిల్ చేస్తుంటే, నగదు ఇచ్చే వ్యక్తి మాత్రం నోట్లు లెక్కపెట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. ఇక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విషయానికి వస్తే, చేతిలో కచ్చితంగా సరిపోయే డబ్బులు లేకపోతే ఆ మిగిలిన చిల్లరను డెలివరీ బాయ్కు టిప్గా ఇచ్చేయాల్సి వస్తోంది.
ఖర్చును తగ్గించే ఆయుధం!
ఈ నగదు ప్రయాణంలో ఒక మంచి విషయం కూడా ఉంది. డిజిటల్ పేమెంట్లలో డబ్బులు ఎంత ఖర్చవుతున్నాయో తెలియకుండానే అయిపోతుంటాయి. కానీ చేతిలో నుంచి నోటు తీసి ఇస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఖర్చుపై నియంత్రణ పెరుగుతుంది. అనవసరమైన వస్తువులు కొనకుండా నగదు మనల్ని ఆపుతుంది. చివరిగా చెప్పాలంటే.. కూరగాయల మార్కెట్లు, కొన్ని పెద్ద మాల్స్ మినహా మిగిలిన చోట్ల నగదు వినియోగం తగ్గింది. వయసు మళ్లిన వారు ఇప్పటికీ నగదును నమ్ముతుంటే, యువత మాత్రం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయింది. వేగం కోసం డిజిటల్, పొదుపు కోసం నగదు.. ఈ రెండూ మన జీవితంలో రెండు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నాయి.