
Indian Players 10000 Rupees Competition: టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా టీమ్ ఇండియాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయలు సంపాదించే భారత క్రికెటర్లు ప్రాక్టీస్ సమయంలో కేవలం రూ. 10,000 కోసం పోటీ పడుతున్నారని సమాచారం. అయితే ఈ పోటీ డబ్బు కోసం కాదని, ఆటగాళ్లలో ఉత్తమ ఫీల్డింగ్ నైపుణ్యాలను పెంచేందుకు చేస్తున్న ప్రత్యేక ప్రయత్నమని తెలుస్తోంది.
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఆటగాళ్లను మెరుగైన ఫీల్డింగ్ చేయడానికి ప్రోత్సహించేందుకు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు బహుమతిని ఇస్తారు. ప్రాక్టీస్ సమయంలో ఎవరు అత్యుత్తమ ఫీల్డింగ్ చేస్తారో వారికి ఈ ప్రైజ్ ఇస్తుంటారు.
భారత ఆటగాళ్లు ఇప్పటికే కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ, ఈ చిన్న మొత్తానికి కూడా ఆసక్తిగా పోటీ పడతారు. కారణం డబ్బు కాదు, జట్టులో పోటీ భావన పెంచడం, ఫీల్డింగ్ స్థాయిని మెరుగుపరచడం.
టీ. దిలీప్ తన జీతం నుంచే ఈ ప్రైజ్ మనీ..
విమల్ కుమార్ తెలిపినట్టు ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఈ డబ్బును తన జీతం నుంచే ఇచ్చి, ఒక మూసివేసిన కవర్లో ఆటగాళ్లకు అందజేస్తారు. టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో ఈ బహుమతి ఇప్పటికే ఇషాన్ కిషన్కు లభించిందని సమాచారం.
టీమ్ ఇండియా ఫీల్డింగ్పై విమర్శలు..
అయితే టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా ఫీల్డింగ్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సెమీఫైనల్ మ్యాచ్ తప్ప మిగతా మ్యాచ్లలో ఫీల్డింగ్ బలహీనంగా కనిపించింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో అత్యధిక క్యాచ్లు వదిలిన జట్టుగా భారత్ నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..