
ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణలో చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం తొలి విడతలో 3.60 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంజూరు చేసింది. స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇళ్లు పూర్తయ్యే దశలోను బట్టి వీటిని లబ్దిదారుల అకౌంట్లో నేరుగా జమ చేస్తోంది. ప్రతీ వారం లబ్దిదారులకు వీటిని అందిస్తోంది. దీని వల్ల ఇంటి నిర్మాణ పనులు కూడా వేగంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేసేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రస్తుతం తొలి దశలో మంజూరు చేసిన ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేసేల ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
రెండో దశ జాబితా ఎప్పుడంటే..?
అటు రెండో జాబితా విడుదలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఏప్రిల్లో కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. అప్పటివరకు మొదటి దశ ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు కేవలం 20 శాతం ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యాయి. మార్చి 31లోపు ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ చివరి నాటికి ఇళ్లన్నీ పూర్తయ్యేలా లబ్దిదారులను ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. అటు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపు డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థలం లేని నిరుపేదలకు వీటి కేటాయింపుల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
చెల్లింపులు ఆగకూడదు
ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఒకటి లేదా రెండు విడతల చెల్లింపులు పూర్తయ్యాక వివిధ కారణాలతో మిగతా చెల్లింపులు ఆపివేయవద్దని అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక ఇళ్లు నిర్మించుకునేవారిపై సామాగ్రి ధరల ప్రభావం పడకుండా నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవావలన్నారు. ప్రజా పాలన- ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇక హౌసింగ్ శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.