
Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ, టీమిండియా తుది జట్టుపై చర్చ ముదిరింది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. ఈ టోర్నీలో అభిషేక్ తన తప్పుల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని, ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలని ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ హోదాలో ఉండి కూడా, కీలక మ్యాచుల్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడం ఏంటని గవాస్కర్ ప్రశ్నించారు.
అభిషేక్ స్థానంలో ఇషాన్ కిషన్?
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మను పక్కన పెట్టి, ఇషాన్ కిషన్ చేత ఓపెనింగ్ చేయించాలని గవాస్కర్ సూచించారు. “అభిషేక్ తన బలహీనతను ప్రత్యర్థులకు పట్టేలా చేస్తున్నాడు. ముఖ్యంగా చేతులకు గ్యాప్ లేకుండా బౌలర్లు బంతులు వేస్తుంటే తడబడుతున్నాడు. గల్లీ క్రికెట్లో కూడా ప్రతి బంతిని సిక్సర్ కొట్టలేం, అలాంటిది వరల్డ్ కప్ ఫైనల్లో జాగ్రత్తగా ఆడాలి. యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజం దగ్గర శిక్షణ పొందుతున్నా, క్రీజులో బాధ్యత లేకుండా ఆడుతున్నాడు” అని గవాస్కర్ విశ్లేషించారు. సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నందున, ఇషాన్-సంజూ జోడీ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వరుణ్ చక్రవర్తిపై వేటు.. కులదీప్ ఇన్
కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగంలోనూ గవాస్కర్ ఒక కీలక మార్పును ప్రతిపాదించారు. గత కొన్ని మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో కులదీప్ యాదవ్ను తీసుకోవాలని చెప్పారు. “వరుణ్ చక్రవర్తి కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింది. అతను ఇప్పుడు స్పిన్నర్లా కాకుండా మీడియం పేసర్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ప్రాక్టీస్ చేస్తున్న ఓవర్స్పిన్ టీ20ల్లో బ్యాటర్లకు మరింత అనుకూలంగా మారుతుంది. అందుకే అనుభవజ్ఞుడైన కులదీప్ అయితే కివీస్ బ్యాటర్లను కట్టడి చేయగలడు” అని గవాస్కర్ కుండబద్దలు కొట్టారు.
నిర్ణయం గంభీర్ చేతుల్లోనే
గవాస్కర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 2023 చేదు జ్ఞాపకాలను చెరిపేయాలంటే, అహ్మదాబాద్లో భారత్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగాలి. మరి కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీనియర్ల సూచనలను పాటిస్తారా? లేక ఫామ్ లేకపోయినా అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిపైనే నమ్మకం ఉంచుతారా? అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. సంజూ శాంసన్ ఒక్కడే భారత్ను సెమీస్ వరకు లాక్కొచ్చాడని, ఫైనల్లో మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలని గవాస్కర్ గుర్తుచేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..