
T20 World Cup 2026: టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఘనవిజయం సాధించింది. భారత జట్టు ఓవరాల్గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్ల పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద సమస్యగా మారింది.
1. వరుణ్ చక్రవర్తి: ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి దక్కింది కేవలం ఒకే వికెట్. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్లోనూ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. సూపర్-8లో సౌతాఫ్రికాపై కూడా 47 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో వరుణ్ ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైనల్లో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన కుల్దీప్ యాదవ్ మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు.
2. అభిషేక్ శర్మ: అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఒక పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అతను కనీసం ఖాతా తెరవకుండానే (డకౌట్) వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా, ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్లో ఇంగ్లాండ్పై మళ్ళీ విఫలమయ్యాడు. ఫైనల్లో అభిషేక్ స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్ను జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుంది.
3. అర్ష్దీప్ సింగ్: అర్ష్దీప్ సింగ్ ఇటీవలి ఫామ్ కూడా భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో అతను 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ వికెట్ తీయకుండానే 43 పరుగులు సమర్పించుకున్నాడు. టీమ్ ఇండియా ప్రస్తుతం ఐదుగురు ప్రధాన బౌలర్లతోనే ఆడుతోంది. కాబట్టి, ప్రధాన పేసర్ ఇలా పరుగులు ఇస్తుంటే జట్టు సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫైనల్లో అర్ష్దీప్ స్థానంలో మహ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞుడిని తీసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి