
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో NH-163 (పాత NH-202) పై రూ. 265 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 2025 మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించినప్పటికీ, కింద ఉండాల్సిన సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
2018లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ, కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటం వల్ల భూసేకరణ పూర్తి కాలేదని.. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 2.54 కోట్ల పరిహారం చెల్లించినప్పటికీ, మధ్య దళారుల వల్ల పనులు ముందుకు సాగడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫ్లై ఓవర్ ప్రారంభమైన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఇదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని కిషన్ రెడ్డి తెలిపారు. స్వయంగా నాటి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాష్ట్ర మంత్రులతో చర్చించారని గుర్తు చేశారని.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం రూ. 1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించామని.. అంబర్పేట సర్వీస్ రోడ్డు విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపి, GHMC రోడ్లు-భవనాల శాఖ అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.