డెబిట్ కార్డు వినియోగదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిగ్ షాకిచ్చింది. ఏటీఎం కార్డుల విత్ డ్రా పరిమితిని భారీగా తగ్గించింది. ఏటీఎం నుంచి విత్ డ్రాలకు సంబంధించి రోజువారీ లిమిట్ను ఒకేసారి తగ్గించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిమితిలో 50 శాతం కోత విధించింది. కస్టమర్ల భద్రతను మెరుగుపర్చడంతో పాటు రిస్క్ నియంత్రణను బలోపేతం చేయడం, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. పీఎన్బీ డెబిట్ కార్డులు వాడేవారికి ఇది పెద్ద షాక్గా చెప్పవచ్చు. కొత్త ఏటీఎం కార్డుల రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.50 వేలకు తగ్గింపు
ఇప్పటివరకు ఒక రోజులో ఏటీఎం కార్డ్ నుంచి రూ.లక్ష వరకు మనీ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి రోజులో రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా రూల్ ప్రవేశపెట్టింది. రూపే NCMC ప్లాటినం డొమెస్టిక్ డెబిట్ కార్డ్, రూపే NCMC ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం డెబిట్ కార్డ్, రూపే PNB పలాష్ డెబిట్ కార్డ్, రూపే బిజినెస్ ప్లాటినం NCMC డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్, PNB మాస్టర్ కార్డ్ ప్లాటినం కార్డులపై పరిమితిని రూ.50 వేలకు తగ్గించారు. ఇక రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్, పిఎన్బి రూపే సెలెక్ట్ నియో, పిఎన్బి రూపే సెలెక్ట్ ఎక్సెల్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్లపై పరిమితిని రూ.50 వేలకు తగ్గించింది. ఇక పీఎన్బీ మాస్టర్ కార్డ్ ప్లాటినంపై రూ.1.5 లక్షలుగా ఉన్న విత్ డ్రా లిమిట్ను రూ.70 వేలకు పరిమితం చేసింది. మిగతా కార్డులకు ప్రస్తుత పరిమితులు వర్తిస్తాయి.
ఆన్ లైన్ లావాదేవీలు యథాతధం
కేవలం ఏటీఎం నుంచి చేసే లావాదేవీలకు మాత్రమే కొత్త రూల్స్ వర్తిస్తాయి. స్టోర్లలో పీఓఎస్ చెల్లింపులు, ఆన్లైన్లో ఈ-కామర్స్, కాంటాక్ట్ లెస్ చెల్లింపులకు గతంలోనే నిబంధనలే వర్తిస్తాయి. వాటి పరిమితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే పీఎన్బీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్, వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం విత్ డ్రా పరిమితిని సెట్ చేసుకోవడం లేదా రీసెట్ చేసుకోవచ్చు.