పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇండియాకు అమెరికా సూపర్ గుడ్న్యూస్ చెప్పింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ భారత్కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనివల్ల సముద్రంలో మార్గమధ్యలో చిక్కుకుపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్ను ఇప్పుడు ఇండియా ఎలాంటి అడ్డంకులు లేకుండా తెచ్చుకునే అవకాశం దొరికింది.
ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతుండటంతో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా రావాల్సిన ముడి చమురుకు బ్రేక్ పడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం వచ్చే ప్రమాదం ఏర్పడింది. మన దేశానికి అవసరమైన ఆయిల్లో దాదాపు 40 శాతం అక్కడి నుంచే వస్తుండటంతో ఈ పరిణామం ఇండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో గ్లోబల్ మార్కెట్ కుప్పకూలకుండా ఉండేందుకే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే లోడ్ అయ్యి ఆగిపోయిన షిప్లకు మాత్రమే వర్తిస్తుందని కొత్తగా రష్యాకు ఆర్డర్లు ఇవ్వడానికి వీల్లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ కావాలనే గ్లోబల్ ఎనర్జీ సప్లైని బందీగా మార్చాలని చూస్తోందని.. దాన్ని అడ్డుకునేందుకే ఈ తాత్కాలిక మినహాయింపు ఇచ్చాం” అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు.
రష్యాకు ఆర్థికంగా పెద్ద లాభం చేకూరకుండా కేవలం గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సప్లై ఆగకుండా చూసేందుకే ఈ డెసిషన్ తీసుకున్నామని ఆయన వెల్లడించారు. గతంలో అమెరికా ఆంక్షల భయంతో రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించిన ఇండియా తాజా పరిణామాలతో మళ్లీ రష్యా వైపు చూడక తప్పలేదు.
అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భారత్కు పెను ముప్పు తప్పినట్లైంది. పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా సేఫ్ అయింది. మరి ఈ 30 రోజుల గడువు ముగిసిన తర్వాత యుద్ధం ఆగకపోతే ఇండియా తదుపరి వ్యూహం ఏంటన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.