ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం (మార్చి 5) తెల్లవారుజామున, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనాను, తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, మహారాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక మిగిలి రాష్ట్రాల విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్గా నియమించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు. నంద్ కిషోర్ యాదవ్ను నాగాలాండ్ గవర్నర్గా నియమించారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ను బీహార్ గవర్నర్గా నియమించారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు.
శివ ప్రతాప్ శుక్లాః
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొలి హయాంలో ఆయన ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన యూపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ బ్రాహ్మణ నాయకులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజ్యసభలో ఉన్నప్పుడు, బీజేపీ ఆయనను విప్గా కూడా నియమించింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు.
తరంజిత్ సింగ్ సంధుః
తరంజిత్ సింగ్ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. ఆయన మాజీ దౌత్యవేత్త. 2020 నుండి 2024 వరకు అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. తన 35 సంవత్సరాల దౌత్య జీవితంలో, భారత-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్గా, జర్మనీలో కాన్సుల్ జనరల్గా కూడా పనిచేశారు.
నంద్ కిషోర్ యాదవ్ః
నంద్ కిషోర్ యాదవ్ బీహార్లోని భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక నాయకుడుగా ఉన్నారు. ఆయన బీహార్ శాసనసభ స్పీకర్గా పని చేశారు. ఆయన బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా, బీహార్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. యాదవ్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటి నుండి, ఆయనను గవర్నర్గా నియమించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
వినయ్ కుమార్ సక్సేనాః
వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఈ పదవికి నియమితులైన తొలి కార్పొరేట్ వ్యక్తి ఆయన. సక్సేనా భారత కార్పొరేట్, సామాజిక రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి. వీకే సక్సేనా గతంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) కు నాయకత్వం వహించారు.
కవిందర్ గుప్తాః
జమ్మూకు చెందిన కవిందర్ గుప్తా ఆ రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయనకు ప్రభుత్వ – సంస్థాగత పాత్రలలో విస్తృత అనుభవం ఉంది. ఆయన 2018లో జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తగా దాదాపు 13 నెలలు జైలు జీవితం గడిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..