Headlines

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!


40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలో వచ్చిన పెను మార్పులకు ఇది సంకేతం. అతనికి 35 ఏళ్లు.. జిమ్‌కు వెళ్తాడు, ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కారణం అడిగితే గుండెపోటు అని తేలింది. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ మృత్యువు, పాతికేళ్ల ప్రాయంలోనే ఎందుకు కబళిస్తోంది? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రక్తంలో, మన అలవాట్లలో దాగిన ఆ రహస్య శత్రువు ఎవరు? ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ కౌశల్ ఛత్రపతి, డాక్టర్ రాహుల్ గుప్తా పంచుకున్న ఆందోళనకర విషయాలేంటో చూద్దాం..

జన్యువుల పాత్ర..

భారతీయులలో జన్యుపరంగానే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ కౌశల్ ఛత్రపతి వివరిస్తున్నారు. మన రక్తంలో లిపోప్రోటీన్ ‘ఎ’, స్మాల్ డెన్సిటీ LDL వంటివి ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో పూడికలు త్వరగా ఏర్పడతాయి. “జన్యువులు గన్‌ను లోడ్ చేస్తే, మన జీవనశైలి ట్రిగ్గర్‌ను నొక్కుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే జన్యువుల కంటే మనం పాటించే తప్పుడు అలవాట్లే ప్రమాదానికి అసలు కారణం.

నేటి యువతలో డయాబెటిస్, బీపీ లేకపోయినా గుండెపోటు వస్తోంది. దీనికి కారణం నిరంతర ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, స్మోకింగ్, వేపింగ్, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం. ఆఫీసు డెడ్ లైన్లు, అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రోలింగ్ చేయడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని గుండెపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. పైగా మన దేశం ‘డయాబెటిస్ రాజధాని’గా మారడం వల్ల యువతలో రక్తనాళాలు త్వరగా దెబ్బతింటున్నాయి.

వాయు కాలుష్యం కూడా గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో నివసించడం అంటే రోజుకు 20 నుండి 50 సిగరెట్లు తాగడంతో సమానమని డాక్టర్ కౌశల్ పేర్కొన్నారు. గాలిలోని సూక్ష్మ కణాలు రక్తంలో చేరి క్లాట్స్ (గడ్డలు) ఏర్పడేలా చేస్తాయి.

నిర్లక్ష్యం వద్దు

యువతలో చాలామంది ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా విపరీతమైన అలసటను సాధారణ సమస్యగా భావిస్తారు. “మేము ఇంకా చిన్నపిల్లలమే కదా.. మాకు హార్ట్ ఎటాక్ రాదు” అనే భ్రమలో ఉండి చికిత్సను ఆలస్యం చేస్తారు. అందుకే 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కుటుంబ చరిత్ర ఉన్నవారు, క్రమం తప్పకుండా కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్ రాహుల్ గుప్తా సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యం అనేది మనం తీసుకునే రోజువారీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం, 7-8 గంటల నిద్ర, పౌష్టికాహారం మరియు ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు. గుండె చిన్నదే కావచ్చు, కానీ అది మన జీవనశైలికి బలంగా స్పందిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *