మానవ సేవయే మాధవ సేవ’ ఈ మాటను చాలా మంది పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. కానీ, దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టేవారు తక్కువమంది ఉంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో పక్కవాడి కష్టం పట్టించుకునే తీరిక ఎవరికి లేదు. సేవ చేయాలని మనసు ఉండాలే కాని.. ఆస్తులు అంతస్తులు అడ్డుకావు. చేస్తున్న పనిలో కూడా కొందరికి ఉపయోగపడి ఆత్మ సంతృప్తి చెందవచ్చు. బతుకు పోరాటంలో ఓ ఆటో డ్రైవర్ తనలోనీ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పాలపాటితండాకు చెందిన రమావత్ బాలునాయక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదిమంది తోబుట్టువులు ఉండడంతో కేవలం బాలునాయక్ నాలుగో తరగతి వరకే చదువుకున్నాడు. చదువుకోవాలని ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. గతేడాది తన అన్న కూతురు ఇంటర్ పరీక్షలు రాస్తున్నప్పుడు పరీక్షా కేంద్రానికి ఆటోలోనే తీసుకెళ్లాడు. అప్పుడు పలు కారణాలతో ఆలస్యం కావడంతో పరిగెత్తుతూ పరీక్షా కేంద్రానికి వస్తున్న విద్యార్థులను చూసి చలించి పోయాడు.
తాను చదువుకోకపోయినా.. చదువుకుంటున్న వారిని ప్రోత్సహించాలని భావించాడు. అప్పటి నుండి పది, ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో కేంద్రానికి తన ఆటోలో ఉచితంగా విద్యార్థులను దించుతున్నాడు. అనివార్య కారణాలతో పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వెళ్లే విద్యార్థుల పాలిట ఆపద్బాంధవుడిగా మారాడు. కుల, మత, వర్గ భేదాలు ఏమాత్రం లేకుండా విద్యార్థులను ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తూ సాటి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉదయం కొండమల్లేపల్లి బస్టాండ్ వద్ద తన ఆటోను ఉంచి ఎవరైనా విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్తున్నప్పుడు వారిని గమనించి ఆటోలో తీసుకెళ్తున్నాడు. చాల మందినీ ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కేంద్రానికి తీసుకెళ్లానని, ఇది తాను ఆటో నడిపినంత కాలం కొనసాగిస్తానని చెబుతున్నాడు. బీహార్ కు చెందిన తనుశ్రీ.. జమ్మూ కాశ్మీర్ ఐపిఎస్ క్యాడర్ అధికారిణిని తనకు ఆదర్శమని చెప్పాడు. తన ఆటోకు ఐపీఎస్ తనుశ్రీ ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. విద్యార్థులు ఈ ఫోటోను చూసి స్ఫూర్తిని పొందాలని తనుశ్రీ ఐపీఎస్ ఫోటోను ఆటోకు పెట్టినట్లు ఆయన చెప్పారు. ఆటో నడిపితే తప్ప పూట గడవని ఆర్థిక పరిస్థితి బాలు నాయక్ ది. అయినా సరే తన విలువైన సమయాన్ని విద్యార్థుల కోసం కేటాయిస్తున్నాడు. బతుకు పోరాటంలో ఆటో డ్రైవర్ బాలు నాయక్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..