తిరుమలకు వెళ్లే చాలామంది ముందు వరాహస్వామిని దర్శించుకుని, ఆ తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్తారు. వాస్తవానికి వరాహస్వామి ఎవరు అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ, తిరుమల గిరుల ఉన్నతికి కారణం ఆయనే. తిరుమల మొత్తం వరాహస్వామిదే.. ఆయన తన స్థలాన్ని శ్రీవారికి అంకితం చేశారు. అందువల్ల తిరుమలలో వరాహస్వామికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ప్రత్యేకతతోనే వరాహస్వామి ఆలయంను స్వామివారి నిలయం ఎడమ వైపున ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి రోజూ తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు, ఆచారాలను నిర్వహిస్తోంది. పూర్వకాలంలో ఒక పెద్ద జలప్రళయం ఏర్పడింది. ఆ సమయంలో భూభాగాలు నీటిలో మునిగిపోయాయి. అప్పుడు దుష్ట రాక్షసుడు హిరణ్యాక్షుడు భూమిని బంతిగా చేసి ఆడుతూ, నానా భీభత్సాలు చేశాడు.
భూదేవితో కలిసి స్థిరపడిన క్షేత్రం..
ఆ పరిస్థితిని చూసి.. శ్రీమహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో అవతరించి, తన శక్తితో హిరణ్యాక్షుడిని సంహరించి, నీటిలో మునిగుతున్న భూదేవిని రక్షించారు. ఆ సంఘటనను చూసి యక్ష, కిన్నర, గంధర్వ దేవతలు శ్రీ భూవరాహస్వామిని పూల వర్షం తో ఆరాధించి, కీర్తించారు. అనంతరం, ఆ శ్వేతవరాహ రూపంలో భూదేవితో సహా తిరుమలలో దర్శనం ఇవ్వడం మొదలైంది. ఈ ప్రాంతంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణను నిర్వహించడంలో వరాహస్వామి ప్రత్యేక పాత్ర పోషించారు. భూదేవిని రక్షించి, భూదేవితో కలిసి స్థిరపడి ఉన్న ఈ క్షేత్రం ఆదివరాహక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో, ఆ క్షేత్రంలో వకుళమాత అనే యోగిని సేవిస్తూ, సపర్యలు చేయడం ద్వారా ఆదివరాహస్వామి విశిష్ట స్థానం పొందారు.
వకుళమాతకు శ్రీనివాసుడి బాధ్యత..
కొంతకాలం తరువాత, క్రూర రాక్షసుడు వృషభానుడు ఆ కొండల్లో తిరుగుతూ మునులను, సజ్జనులను హింసించసాగాడు. వాళ్ళు వరాహస్వామి వద్ద విన్నపం చేసి, రక్షణను కోరారు. శ్వేత వరాహస్వామి వృషభానుతో యుద్ధం చేసి, విజయం సాధించారు. ఈ సమయంలో, వరాహస్వామికి పర్వత ప్రాంతంలో తల మీద గాయమై రక్తం కారుతున్న శ్రీనివాసుడు కనిపించారు. ఆదివరాహస్వామి వకుళమాతను శ్రీనివాసునికి సేవ చేయమని ఆదేశించారు. ఆ క్షణం నుంచి వకుళమాత భక్తి, ప్రేమతో శ్రీనివాసుని సేవలో నిమగ్నమై ఉంటారు. అందువల్ల, తిరుమలలోకి వెళ్ళే భక్తులు మొదటగా ఈ చారిత్రక, పవిత్రమైన వరాహస్వామిని దర్శించక తప్పదు. ఆయన పరిచయం, సేవ, చరిత్ర భక్తులకు ఆత్మీయత, ఆరాధనాత్మక అనుభూతిని అందిస్తుంది.