
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరల్లో అస్థిరతత కొనసాగుతోంది. గత ఆరు రోజులుగా యుద్దం కొనసాగుతూనే ఉండగా.. గురువారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. అదే స్థాయిలో ఇరాన్ కూడా తిప్పికొడుతోంది. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇక పసిడి ధరల ఊపు కూడా ప్రశ్నార్థకంగా మారింది. గోల్డ్ రేటు దాదాపు 1.5 శాతం పెరగ్గా.. వెండి ధరలు 3 శాతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు శాంతించినప్పటికీ.. యుద్దం ఇలాగే కొనసాగితే ధరలు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదు కావొచ్చని అంటున్నారు.
వెండి రూ.3 లక్షల మార్క్..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు రూ.3 లక్షలకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం రూ.1.80 లక్షలకు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, సిల్వర్ ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం రూ.2.95 లక్షల వద్ద వెండి ట్రేడవుతుండగా.. రేపు, మాపో మూడు లక్షలకు చేరుకోవచ్చని అంటున్నారు. ఇటీవల 3 లక్షలు దాటగా.. ఇటీవల కాస్త తగ్గింది. ప్రస్తుతం రూ.2.90 లక్షల మార్క్ వద్ద ఊగిసలాడుతుండగా.. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో రూ.3 లక్షలను దాటొచ్చని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల క్రమంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఇప్పటివరకు 19 శాతం పెరిగాయి. ఇక వెండి ధరలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 శాతం పెరిగాయి.
పెరుగుతున్న ప్లాటినం ధరలు
ఇక ప్లాటినం ధరలు కూడా పెరుగుతున్నాయి. అమెరికా డాలర్ గత కొంతకాలంగా పెరుగుతోంది. దీంతో ఇతర కరెన్సీలు కలిగి ఉన్నవారికి డాలర్ విలువ కలిగిన ఆస్తులు పెరిగాయి. ఇరాన్పై అమెరికా సైన్యం దాడికి పాల్పడిందని ట్రంప్ ప్రకటించాక ప్లాటినం ధరలు పెరుగుతున్నాయి. స్పాట్ ప్లాటినం ధరలు ఔన్సుకు 1 శాతం పెరిగి 2,104.25 డాలర్లకు చేరుకున్నాయి. అటు గోల్డ్ రేట్లు ప్రస్తుతం రూ.1.65 లక్షల వద్ద ట్రేడువుతుండగా.. యుద్దం ఇలాగే కొనసాగితే రూ.1.80 లక్షలకు త్వరలో చేరుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాదిలోనే వెండి ధర రూ.4 లక్షల మార్క్ను అధిగమించి ఆల్ టైం రికార్డ్కు చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక సిల్వర్తో పాటు గోల్డ్ రేట్లు కూడా రూ.1.90 లక్షలు దాటి చరిత్రలో గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. గత కొన్నేళ్లుగా దేశాల మధ్య యుద్దంతో పసడి ధరలు పెరుగుతున్నాయి.