తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్ప్రెస్లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్ప్రెస్లుగా వీటిని రైల్వేశాఖ నడపనుంది. అందులో ఒకటి విశాఖపట్నం-కొల్లాం ఎక్స్ప్రెస్ కాగా.. మరొకటి చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ప్రెస్. వీటి రాకతో తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ.. తాజాగా ఈ రెండింటిని తీసుకొచ్చింది. ఈ రైళ్ల షెడ్యూల్స్ ఏంటి..? ఏయే ప్రాంతాల మధ్య ప్రయాణిస్తాయి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం,.
విశాఖపట్నం-కొల్లం ఎక్స్ప్రెస్ వివరాలు
విశాఖపట్నం-కొల్లం ఎక్స్ప్రెస్(18501/18502) ప్రతీ మంగళవారం సర్వీసులు అందిస్తోంది. ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇది ఉదయం 8.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఇది బుధవారం సాయంత్రం 5.20 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 9.52 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. ఇక రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.
చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్
ఇక చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ప్రెస్(17065/17066) షెడ్యూల్ విషాయానికొస్తే.. ఇది మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి బుధవారం ఉదయం 11.20 గంటలకు షాలిమార్కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు షాలిమార్ నుంచి బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది.
ఈ రైళ్లు రద్దు
నిర్వహన కారణాల వల్ల రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే పలు రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య రద్దు చేశారు. రాజమండ్రి-కాకినాడ పోర్ట్(07524), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్-రాజమండ్రి(07523) రైళ్లను ఈ నెల 4 నుంచి 9 తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే పలు ప్రత్యేక రైళ్లను కూడా రైల్వేశాఖ ప్రకటించింది. కాకినాడ-విజయవాడ(17258), విజయవాడ-గుంటూరు(67229), గుంటూరు-విజయవాడ(67230), విజయవాడ-కాకినాడ(17257) రైళ్లను ఈ నెల 5 నుంచి 8వ తేదీ మధ్య తిప్పనుంది. వీటిల్లో 16 చైర్ కోచులు ఉండనున్నాయి. ఈ రైళ్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించింది. కాగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. ఇవి ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. ఇక పండుగలు ఉన్న సమయాల్లో కూడా ప్రత్యేక సర్వీసులను తిప్పుతూ ఉంటుంది.