India vs England semifinal T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య కీలక సెమీఫైనల్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) కీలక అంచనా వేశాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్కు చేరుతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్పై ఆసక్తి మరింత పెరిగింది. అభిమానులు కూడా వాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
సెమీఫైనల్ ముందు వాన్ అంచనా..
మైకేల్ వాన్ మాట్లాడుతూ తనకు ఒక “వింత ఫీలింగ్” ఉందని, ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. టోర్నమెంట్ ప్రారంభంలో భారత్ ఫేవరెట్గా కనిపించినప్పటికీ, సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందడం కొంత సందేహం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించాడు.
ఇక మరోవైపు ఇంగ్లాండ్ మంచి ఫామ్లో ఉంది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్కు చేరిన జట్టు ఒత్తిడిలో కూడా గెలిచే సామర్థ్యం చూపిందని వాన్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ స్పిన్ అటాక్ అతిపెద్ద బలం..
వాన్ అభిప్రాయం ప్రకారం ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించవచ్చు. ఆదిల్ రషీద్ (Adil Rashid), లియామ్ డాసన్ (Liam Dawson), విల్ జాక్స్ (Will Jacks) త్రయం టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిందని ఆయన ప్రశంసించాడు.
భారత్ తరపున వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఎక్కువ వికెట్లు తీసుకున్నప్పటికీ, కొన్ని కీలక మ్యాచ్ల్లో ఖరీదైన బౌలింగ్ చేశాడని వాన్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్లో జోఫ్రా ఆర్చర్ (Jofra Archer), శామ్ కరణ్ (Sam Curran), జామీ ఓవర్టాన్ (Jamie Overton) వంటి పేసర్లు ఉండటం కూడా వారికి అదనపు బలం అని ఆయన అన్నాడు.
ఫీల్డింగ్ కూడా కీలక అంశం..
ఇంగ్లాండ్ ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగులు తీయడంలో చూపిన వేగం వాన్ను ఆకట్టుకున్నాయి. మైదానంలో చిన్న చిన్న విషయాలను కచ్చితంగా అమలు చేయడం నాకౌట్ మ్యాచ్లలో పెద్ద తేడా తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్పై ఇటీవల సాధించిన విజయం కూడా జట్టు పోరాటస్ఫూర్తిని చూపించిందని వాన్ తెలిపాడు.
బట్లర్ ఫామ్పై ఆందోళన..
అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler) ఫామ్పై వాన్ కొంత ఆందోళన వ్యక్తం చేశాడు. వరుసగా తక్కువ స్కోర్లు చేయడం జట్టుకు సమస్య కావచ్చని చెప్పాడు.
అయితే, ముంబై పిచ్ అతని స్ట్రోక్ప్లేకు అనుకూలంగా ఉండొచ్చని, అతను తన సహజమైన ఆటతీరుకు తిరిగి వస్తే ఇంగ్లాండ్కు పెద్ద ప్లస్ అవుతుందని వాన్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్ బౌలింగ్ లోతు, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం కారణంగా సెమీఫైనల్లో భారత్పై పైచేయి సాధించే అవకాశం ఉందని మైకేల్ వాన్ భావిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..