ఏపీ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమలుతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ 92 శాతం దాటుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగ్గా.. ఉద్యోగం, విద్య వ్యాపార అవసరాల కోసం వారికి ఫ్రీ బస్సు జర్నీ ఉపయోగపడుతుంది. ఇక పురుష ప్రయాణికులు మాత్రం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో భారీగా తగ్గారు. ఈ క్రమంలో స్త్రీశక్తి పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు
ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువైంది. దీంతో త్వరలో కొత్త బస్సులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అదనంగా తీసుకురానున్న ఈ బస్సులతో రద్దీ తగ్గుతుందని ప్రకటించారు. దీని వల్ల మహిళలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. బస్సుల్లో రద్దీ వల్ల మహిళల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడం, కండక్టర్లతో గొడవ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త బస్సుల రాకతో మహిళలకు రద్దీ లేని ప్రయాణ సౌకర్యం రానుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రూపంలో ఇప్పటివరకు రూ.1,714 కోట్లు అందాయి.
26 లక్షల మార్క్
గత ఏడాది ఆగస్టులో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభంగా.. అప్పటినుంచి డిసెంబర్ వరకు రోజు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 26 లక్షలకు సంఖ్య పెరిగింది. ఇక మగ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 37 శాతానికి పడిపోయింది. అటు మహిళలు లేకపోయినా కండక్టర్లు ఇన్సెంటివ్స్ కోసం ఉచిత బస్సు టికెట్లు కొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఇలాంటివారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు తనిఖీలు చేపడుతున్నారు.