ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా వృద్ధుల్లో కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ చక్కెర–ఉప్పు ఉన్న స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటివి దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఆంకాలజిస్ట్ డాక్టర్ జయేష్ శర్మ వివరణ ప్రకారం.. క్యాన్సర్కు సంబంధించిన భయాల్లో చాలా వరకు అపోహలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, మైక్రోవేవ్ ఓవెన్ వాడకం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మైక్రోవేవ్లు విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉపయోగించి ఆహారాన్ని వేడి చేస్తాయి. ఈ వికిరణం “అయనీకరణం కానిది” (Non-ionizing radiation). ఇది అణువుల నుంచి ఎలక్ట్రాన్లను తొలగించే శక్తి కలిగి ఉండదు, అలాగే DNA నిర్మాణాన్ని నేరుగా దెబ్బతీయదు.
దీనికి విరుద్ధంగా, ఎక్స్-రేలు మరియు గామా కిరణాలు వంటి “అయనీకరణ వికిరణం” (Ionizing radiation) DNAలో మార్పులు కలిగించి క్యాన్సర్కు దారితీయవచ్చు. మైక్రోవేవ్ తరంగాలకు ఆ సామర్థ్యం లేదు. కాబట్టి సరిగ్గా ఉపయోగించినప్పుడు మైక్రోవేవ్లో ఆహారాన్ని వేడి చేయడం సాధారణంగా సురక్షితమే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- మైక్రోవేవ్లో ప్లాస్టిక్ కంటైనర్లు వాడటాన్ని వీలైనంత వరకు నివారించాలి.
- వేడి వల్ల కొన్ని ప్లాస్టిక్ పదార్థాల నుంచి రసాయనాలు ఆహారంలో కలిసే అవకాశం ఉంది.
- “Microwave safe” అని గుర్తింపు ఉన్న గాజు లేదా సిరామిక్ పాత్రలను ఉపయోగించడం మంచిది.
- ఓవెన్ తలుపు సరిగ్గా మూసుకుపోయేలా, దెబ్బతినకుండా ఉండేలా చూసుకోవాలి.
- ఆహారాన్ని సమానంగా వేడి అయ్యేలా మధ్యలో కలపడం లేదా తిప్పడం అవసరం.
- మొత్తానికి, మైక్రోవేవ్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనే భయం శాస్త్రీయ ఆధారాలు లేని అపోహ.
- కానీ సరైన పాత్రలు, సరైన పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోవచ్చు.