ఏ తల్లి అయినా కన్నబిడ్డలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు తల్లులు క్షణికావేశంలో నవమాసాలు మోసిన పిల్లలకు మరణ శాసనం రాస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బీబీనగర్ మండలం గొల్లగూడెంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్ రైల్వే శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఐశ్వర్య అనే యువతిలో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం రెండేళ్ల పాప, 10 నెలల బాబు ఉన్నారు. అయితే వీరి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగు తున్నాయి.
ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులు, పెద్దమనుషులు సర్ది చెప్పి ఆమెను తీసుకొచ్చి అత్తారింట్లో వదిలేసి వెళ్లారు. కానీ అదే రోజు రాత్రి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను దిండుతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరివేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఈఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ అభం శుభం తెలియని చిన్నారులను చంపడం స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేమాలను పరిశీలించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.