దీపం పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది. ముందుగా లబ్దిదారులు గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అకౌంట్లో నగుదును జమ చేస్తోంది. గ్యాస్ డెలివరీ తీసుకున్న 48 గంటల్లోనే ఈ సొమ్మును నేరుగా లబ్దిదారుల అకౌంట్లో వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇదొక హామీ కాగా.. 2024 దీపావళి నుంచి ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని వల్ల సామాన్యులపై గ్యాస్ సిలిండర్ భారం తగ్గడంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
చంద్రబాబు కీలక ఆదేశాలు
ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అదనంగా లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తోన్నాయి. దీనిపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపం పథకం సమర్ధవంతంగా అమలు కావాలని, ఎలాంటి అక్రమాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లబ్దిదారుల చేతుల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగాలని పేర్కొన్నారు.
బస్ స్టేషన్లలో తాగునీటి సౌకర్యం
సమ్మర్ వస్తున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అన్ని బస్ స్టేషన్లలో వేసవికాలం దృష్ట్యా తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. తాగునీరుకు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్ స్టేషన్లలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బస్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బస్సు సర్వీసులు బాగున్నా.. బస్టాండ్లలో సౌకర్యాలు లేకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ స్టేషన్లలో తాగునీరు, టాయిలెట్లు, ఫ్యాన్లు, సీటింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
వాట్సప్ గవర్నెన్స్లో మరిన్ని సేవలు
అటు వాట్సప్ గవర్నెన్స్లో మరిన్ని ప్రభుత్వ సేవలు విస్తరించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ సర్వీసుల సంఖ్యను 953కి పెంచినట్లు చె్పారు. వాట్సప్ సేవలు ప్రజలందరూ వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 100 శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలన్నారు.