Sahibzada Farhan : సాహిబ్‌జాదా ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

Sahibzada Farhan : సాహిబ్‌జాదా ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు


Sahibzada Farhan : టీ20 క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఈ యువ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఫర్హాన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. కేవలం 60 బంతుల్లోనే 100 పరుగులు చేసిన ఆయన, సిక్సర్ల సునామీతో పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. కేవలం ఒకే మ్యాచ్‌తో ఐదు భారీ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఒకే వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన మొదటి బ్యాటర్‌గా సాహిబ్‌జాదా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఏ ఆటగాడికీ ఇది సాధ్యం కాలేదు. అంతేకాకుండా ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు (2) చేసిన క్రిస్ గేల్ రికార్డును కూడా ఆయన సమం చేశాడు. ఫర్హాన్ ఫామ్ చూస్తుంటే ఈ రికార్డును త్వరలోనే తిరగరాసేలా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ రికార్డు బద్ధలు

2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డును ఫర్హాన్ అధిగమించాడు. ప్రస్తుత 2026 టోర్నీలో ఫర్హాన్ ఇప్పటివరకు 383 పరుగులు చేసి, ఒకే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రన్ మెషీన్ కోహ్లీ రికార్డును దాటడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఫర్హాన్ దానిని చాలా సులువుగా చేసి చూపించాడు.

సిక్సర్ల కింగ్.. అత్యధిక సిక్సర్లు

ఈ వరల్డ్ కప్‌లో ఫర్హాన్ బ్యాట్ నుంచి ఇప్పటివరకు 18 సిక్సర్లు వచ్చాయి. ఇది కూడా ఒక వరల్డ్ రికార్డే. ఇంతకుముందు ఒకే వరల్డ్ కప్‌లో షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ చెరో 17 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు ఫర్హాన్ వారిని వెనక్కి నెట్టేశాడు. గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

పాక్ తరపున రెండో భారీ స్కోరు

శ్రీలంకపై చేసిన 100 పరుగులు, పాకిస్థాన్ తరపున టీ20 వరల్డ్ కప్‌లో నమోదైన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2014లో అహ్మద్ షెజాద్ చేసిన 111 పరుగుల రికార్డు మాత్రమే దీనికంటే ముందుంది. అదేవిధంగా, ఈ మ్యాచ్‌లో ఫకర్ జమాన్‌తో కలిసి ఫర్హాన్ 176 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద పార్ట్‌నర్‌షిప్. గతంలో కివీస్ జోడీ టిమ్ సైఫర్ట్ – ఫిన్ అలెన్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును వీరు చెరిపివేశారు.

సాహిబ్‌జాదా ఫర్హాన్ సృష్టిస్తున్న ఈ విధ్వంసం చూస్తుంటే, పాకిస్థాన్ సెమీస్ చేరకపోయినా వ్యక్తిగతంగా ఆయన ఈ టోర్నీలో ఒక లెజెండ్‌గా మారిపోయాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *