
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త రేటు 2026–27 ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుంది. ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం రూ.3,075 విలువైన ఈ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్స్ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే మీరు 200 సార్లు టోల్ ప్లాజా దాటితే, ఒక సంవత్సరం పూర్తి కాకపోయినా పాస్ గడువు ముగిసినట్లుగా పరిగణిస్తారు.
ఎన్హెచ్ఏఐ ఆదేశాలు
ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లను అమలు చేయాలని, ప్రయాణికులు, ఇతర స్టేక్హోల్డర్స్ కు సమాచారం ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాస్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకారం, టోల్ రేట్స్ ను ప్రతి సంవత్సరం సమీక్షించి సవరించడం సాధారణ ప్రక్రియలో భాగం. ఈ ఏడాది కూడా అదే ప్రక్రియలో భాగంగా యాన్యువల్ పాస్ ధరను కొద్దిగా పెంచారు. జాతీయ రహదారులపై రోజూ లేదా తరచుగా ప్రయాణించే వారికి ఈ యాన్యువల్ టోల్ పాస్ ఇప్పటికీ అనుకూలమైన ఎంపికగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది పదే పదే టోల్ చెల్లించే ఇబ్బందిని తగ్గిస్తుంది.
యాన్యువల్ టోల్ పాస్ ఎలా పొందాలి?
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే డ్రైవర్లు సులభంగా యాన్యువల్ టోల్ పాస్ పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని ఎన్హెచ్ఏఐ అందిస్తోంది. ముందుగా వారి వాహనంలో యాక్టివ్ ఫాస్టాగ్ ఉండాలి. వాహన యజమానులు ఎన్హెచ్ఏఐ పోర్టల్ లోకి లేదా తమ ఫాస్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ /యాప్ లోకి లాగిన్ అయి యాన్యువల్ పాస్ కోసం అప్లై చేయాలి. అనంతరం నిర్దేశించిన ఫీజు ను ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి. చెల్లింపు పూర్తయ్యాక, యాన్యువల్ పాస్ మీ ఫాస్టాగ్ అకౌంట్ కు లింక్ అవుతుంది. ఆ తర్వాత మీరు టోల్ ప్లాజాస్ వద్ద అదనపు చెల్లింపు లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి