సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ అమాయక జీవులు ఇంటికి ఆకర్షణ తీసుకురావడమే గాకుండా. ఇంటి సభ్యులతో అత్యంత ప్రేమను, విధేయతను చూపిస్తాయి. మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య సంబంధాన్ని వాస్తు శాస్త్రం ఎంతో ప్రముఖంగా తెలియజేసింది. వాస్తు ప్రకారం కొన్ని జంతువులను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరించడంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ అదృష్ట జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్కలు:
కాలభైరవుని సేవకుడుగా, లక్ష్మీరాకకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. కుక్కను కాలభైరవుని సేవకుడిగా భావిస్తారు. కుక్కకు సేవ చేసే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక పరిస్థితిని పెంచడంతోపాటు దుష్టశక్తుల నుంచి ఇంటిని రక్షిస్తుంది.
చేపలు:
చేపలు ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావించబడతాయి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వాస్తు ప్రకారం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ముఖ్యంగా గోల్డెన్ ఫిష్ ఉంచితే ఇంట్లో సంతోషం, శాంతి పెరుగుతాయని నమ్మకం. అక్వేరియంను ఇంటి ఈశాన్య (నార్త్-ఈస్ట్) లేదా ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) దిశలో ఉంచితే మంచిదని చెబుతారు. ఇది ప్రతికూల శక్తిని తగ్గించి పురోగతికి మార్గం చూపుతుందని విశ్వాసం.
కుందేలు:
కుందేలు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా వాస్తు ప్రకారం సానుకూలతకు సంకేతంగా కూడా భావిస్తారు. ఇంట్లో కుందేలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి తగ్గి, కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం.
తాబేలు:
తాబేలను సంపద, శ్రేయస్సు, దీర్ఘాయుష్షుకు ప్రతీకగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇంట్లో తాబేలు కనిపించడం విష్ణువు అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల కొందరు ఇంటి ఉత్తర దిశలో లోహం లేదా స్ఫటికంతో తయారైన తాబేలు ప్రతిమను ఉంచుతారు. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుందని విశ్వాసం.
ఆవు:
హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆవును పెంచుకోవడం లేదా ఆవుకు సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఇది కుటుంబానికి శాంతి, సంపద, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం.





