కర్ణాటకలో 35 ఏళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ లైన్స్ సమీపంలోని అబ్బిగెరెలో బుధవారం (మార్చి 04) తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని సుష్మ (35) గా గుర్తించారు. ఆమె గతంలో డెల్లో ఉద్యోగం చేసేది. ఐదు సంవత్సరాల క్రితం పునీత్ కుమార్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరిగేవి. మంగళవారం (మార్చి 03), సుష్మ తన అత్తగారి కల్పనతో వంట విషయంలో గొడవ పడిందని సమాచారం. సుష్మను వంట చేయకుండా ఆమె అత్తగారు పదే పదే అడ్డుకున్నారని, వివిధ అంశాలపై వేధింపులకు గురిచేశారని ఆమె కుటుంబం ఆరోపించింది. కొనసాగుతున్న పరిస్థితితో కలత చెందిన సుష్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహిళ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఆమె భర్త పునీత్ కుమార్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె అత్త కల్పన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటనకు దారితీసిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..