కేరళలోని కొచ్చిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కరుమల్లూరులో కొబ్బరి చెట్టు కూలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు వెలియతునాడుకు చెందిన సుధీర్ సబియా దంపతుల కుమారుడు ముహమ్మద్ సినాన్ గా గుర్తించారు. ఈ ప్రమాదం బాలుడి ఇంటి ఆవరణలో జరిగింది.
అలువా పశ్చిమ పోలీసుల కథనం ప్రకారం.. సినాన్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఎండిన కొబ్బరి చెట్టు మీద ఉన్న రామ చిలుకను చూశాడు. ఎలాగైనా ఆ చిలుకను పట్టుకోవాలని భావించిన సినాన్ దానిని పట్టుకునే ప్రయత్నంలో కొబ్బరి చెట్టుని నరకడం మొదలు పెట్టాడు. చెట్టుమీద కూర్చున్న చిలుకను పట్టుకోవడానికి తన స్నేహితులతో కలిసి ప్రయత్నించాడు. అయితే చెట్టు అకస్మాత్తుగా కూలిపోయి సినాన్ మీద పడింది. దీంతో సినాన్ కు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
సినాన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అక్కడికి చేరుకునేలోపే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శవపరీక్ష తర్వాత ఆ బాలుడి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సినాన్ తొట్టక్కటుకర హోలీ గోస్ట్ కాన్వెంట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. పోలీసులు బాలుడి మృతిని అనుమానాస్పద మరణాల కేసుగా నమోదు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…