యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?

యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?


యాదగిరిగుట్ట, నేడు యాదాద్రిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం, తెలంగాణ రాష్ట్రంలో విరాజిల్లుతున్న ఒక దివ్యధామం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, పంచ నరసింహ క్షేత్రంగా అసంఖ్యాకమైన రహస్యాలను, అద్భుతమైన మహిమలను తనలో దాచుకుంది. ఈ క్షేత్రం యొక్క పుట్టుక, ఇక్కడ కొలువైన నరసింహస్వామి ఐదు స్వరూపాలు, వాటి ప్రాముఖ్యత, ఈ ఆలయ విశేషాలు భక్తులకు లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.

యాదర్శి మహర్షి కథ – క్షేత్ర ఆవిర్భావం

స్కాంద పురాణం ప్రకారం.. రామాయణ కాలానికి చెందిన ఋష్యశృంగ మహర్షి, శాంతాదేవి దంపతుల కుమారుడు యాదర్శి. ఆయనకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి ఉండేది. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం స్వామి ధరించిన ఉగ్ర నరసింహ రూపాన్ని చూడాలని యాదర్శి తీవ్రంగా కోరుకున్నారు. ఈ కోరికతో ఆయన అరణ్యాలు, కొండలు తిరుగుతూ యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకుని ఒక రావి చెట్టు కింద తపస్సు ప్రారంభించారు. ఆంజనేయస్వామి ఆయనకు దర్శనమిచ్చి, ఈ తపస్సు లోకకల్యాణం కోసం అని, తన తోడు ఉంటుందని అభయమిచ్చారు. యాదర్శి తీవ్ర తపస్సుతో ప్రసన్నుడైన నరసింహస్వామి ఐదు దివ్య రూపాలలో దర్శనమిచ్చారు. అవి: లక్ష్మీనరసింహ, యోగానంద నరసింహ, జ్వాలా నరసింహ, గండభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ. యాదర్శి తన కోరిక నెరవేరాక స్వామిలో ఐక్యమైపోయారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండకు యాదగిరిగుట్ట అనే పేరు యాదర్శి పేరు మీదుగానే వచ్చింది.

కలియుగంలో స్వామి పునర్దర్శనం

త్రేతాయుగంలో ఆవిర్భవించిన నరసింహస్వామి, ఆ తర్వాత అవ్యక్త రూపంలోకి వెళ్లి మహర్షులకు, దేవతలకు మాత్రమే దర్శనమిచ్చేవారు. కలియుగం ప్రారంభమయ్యేసరికి తిరిగి వ్యక్తమవ్వాలని సంకల్పించారు. కొండ కింద నివసించే నిర్మల మనస్సు గల ఒక కోయ వనితకు కలలో కనిపించి, కొండపైన తన నాలుగు స్వరూపాలున్నాయని, వెతికి కనుగొనమని ఆదేశించారు. ఆమె కొంతమందితో కలిసి కొండపైకి వెళ్లి నరసింహ స్వరూపాలను గుర్తించడంతో స్వామి మళ్ళీ లోకానికి వ్యక్తమయ్యారు. భగవత్ అనుగ్రహానికి కులం, గోత్రం అవసరం లేదని, నిర్మలమైన భక్తి, మనస్సు ఉంటే చాలని ఈ సంఘటన నిరూపిస్తుంది.

పంచ నరసింహ స్వరూపాల దర్శనం

ప్రతి భక్తుడు యాదాద్రిలో ఐదు నరసింహ స్వరూపాలను దర్శించుకునే అవకాశం ఉంది..

1. లక్ష్మీనరసింహస్వామి: హిరణ్యకశిపుని సంహరించాక ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని లక్ష్మీదేవి శాంతింపజేసింది. ప్రస్తుతం ఆలయం వెలుపల కొలువై ఉన్న పెద్ద మూర్తులు లక్ష్మీనరసింహ స్వరూపానికి ప్రతీకగా నిలుస్తాయి.

2. యోగానంద నరసింహస్వామి: గుహాలయంలోని ప్రధాన అర్చామూర్తి యోగానంద నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తారు. అర్చకులు అర్చనలు చేసేటప్పుడు ఈ మూర్తిని స్పష్టంగా చూడవచ్చు.

3. జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి అదే గుహలో సర్ప రూపంలో కొలువై ఉన్నారు. ఇది భక్తులకు నేరుగా కనిపించకపోయినా, అక్కడ నిరంతరం వెలుగుతున్న అఖండ దీపం జ్వాలా నరసింహ స్వరూపంగా భావిస్తారు. “ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం” అనే మంత్ర సాధన చేసే ఉపాసకులకు ధ్యాన సమాధిలో మహా సర్ప రూపంలో, అగ్ని స్వరూపంలో దర్శనమిస్తారని చెబుతారు.

4. గండభేరుండ నరసింహస్వామి: ఈ స్వామి రెండు ప్రదేశాలలో కనిపిస్తారు. మొదటిది, గర్భాలయం సమీపంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే ఒక బండ చీలిక వద్ద ఆవిర్భవించిన ప్రదేశంగా చెబుతారు. రెండవది, ఆలయ ప్రాంగణంలోని అష్టభుజ మండపంలో ఒక రాతిపై గండభేరుండ నరసింహస్వామి రూపం చెక్కి ఉంది.

5. ఉగ్ర నరసింహస్వామి: ఈ స్వామి స్వరూపం ఆలయంలో నేరుగా కనిపించదు. యాదగిరిగుట్ట కొండ చుట్టూ ఉగ్ర నరసింహస్వామి శక్తి ఆవరించి ఉంటుందని నమ్ముతారు. యాదర్శి ఈ రూపం కోసమే తపస్సు చేసింది. దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు (నెగెటివ్ ఎనర్జీస్) ఈ రూపానికి భయపడి పారిపోతాయి. మానసిక, శారీరక సమస్యలతో బాధపడేవారు యాదాద్రి గిరి ప్రదక్షిణం చేస్తే ఉగ్ర నరసింహస్వామి రక్షణలోకి వెళ్ళి దుష్టశక్తుల నుంచి విముక్తి పొందగలరు.

వైద్య నారాయణస్వామి మహిమలు:

యాదగిరిగుట్ట నరసింహస్వామిని “వైద్య నారాయణస్వామి” అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రానికి అద్భుతమైన రోగ నివారణ శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒక సంఘటన ప్రకారం, ఒక స్త్రీకి తీవ్రమైన అనారోగ్యం, శస్త్రచికిత్స చేసినా నయం కాకపోవడంతో వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆ స్త్రీ యాదాద్రికి వచ్చి 11 రోజులు ఆలయంలో నిద్రచేసి, గిరి ప్రదక్షిణం చేసింది. 11వ రోజు రాత్రి నరసింహస్వామి కలలో ఆమెకు శస్త్రచికిత్స చేసినట్లు కనిపించారు. ఉదయం లేవగానే ఆమె పూర్తిగా కోలుకుంది. తిరిగి వైద్య పరీక్షలు చేయించుకోగా, గతంలో ఉన్న వ్యాధి పూర్తిగా నయమైనట్లు నిర్ధారణ అయింది. ఇది యాదగిరిగుట్ట మహిమకు ఒక నిదర్శనం.

ప్రస్తుతం, యాదాద్రిని అద్భుతంగా పునరుద్ధరించారు. గిరి ప్రదక్షిణం కోసం చక్కని మార్గం, పచ్చని మొక్కలు, లక్ష్మీ పుష్కరిణి వంటి సౌకర్యాలను కల్పించారు. ఈసారి యాదాద్రిని సందర్శించినప్పుడు, యాదర్శి తపస్సు చేసిన తపోవృక్ష స్థలిని, లక్ష్మీ పుష్కరిణిని దర్శించి, గిరి ప్రదక్షిణం చేసి, స్వామి అనుగ్రహాన్ని పొందాలని చెబుతారు. ఈ క్షేత్ర దర్శనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *