
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం.. పర్యాటకంగానూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మికం, చారిత్రకం, అహ్లాదం మూడు విభాగాల్లో రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. దీంతో స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటుండగా.. యాదాద్రిలో కూడా భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటోంది. గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
పునర్ నిర్మాణంతో మారిన రూపురేఖలు
తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ 1300 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్ నిర్మించారు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆధునికతను జోడించి వెయ్యేండ్ల వరకు చెకుచెదరకుండా ఆలయాన్ని పునర్మించారు. ఐదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని కృష్ణ శిలలతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా నిర్మించారు. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. స్వయంభూ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన జరిగింది. ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత దేవస్థానం రూపురేఖలే మారిపోయాయి.
గత ఏడాది కోటి దాటిన భక్తజనం
ఆలయ పునరుద్ధరణ తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొందరు ఏడాదిలో నాలుగైదుసార్లు దర్శంచి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 15 వేల మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 30 నుంచి 50 వేల మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. సగటున రోజుకు 40 వేల పైచిలుకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. 2025 జూన్ నెలలో అత్యధికంగా 20.06 లక్షల మంది, గత ఏడాది కాలంలోఏకంగా 1.58 కోట్ల మంది స్వామిని దర్శించుకున్నారు.
టాప్-3లో యాదగిరిగుట్టతోపాటు..
ఇటీవల కాలంలో పర్యాటకులు ఎక్కువగా ఆధ్మాత్మిక క్షేత్రాలను, చారిత్రక కట్టడాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆహ్లాదకర ప్రదేశాలు, వన్యప్రాణులను భారీగానే సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించిన పర్యాటకుల గణాంకాలను నమోదు చేసింది. ఆ ప్రకారం.. టాప్-10లోని తొలి మూడు స్థానాల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర ఆలయాలు ఉన్నాయి. ఆయా క్షేత్రాలకు ఏడాది పొడవునా భక్తులు భారీగా తరలి వచ్చారు. 2025 జూన్ నెలలో అత్యధికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని ఆగస్టులో 18.75 లక్షల మంది సందర్శించారు. అక్షరాభాస్యానికి ప్రసిద్ధి గాంచిన బాసర జ్ఞానసరస్వతి ఆలయాన్ని మే, జూన్ నెలల్లో4 లక్షల మంది చొప్పున దర్శించుకున్నారు.