
నీరు అనేది మానవ జీవనానికి ఆధారం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు త్రాగడం ఎంతో అవసరం అని అందరికీ తెలుసు. చాలాకాలంగా రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి అనే మాట మనం వింటూ వచ్చాం. అయితే తాజా అధ్యయనాల ప్రకారం, ప్రతి ఒక్కరి శరీరానికి అవసరమైన నీటి పరిమాణం వారి వయస్సు, లింగం, వాతావరణ పరిస్థితులు, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనలను ఉటంకిస్తూ ఒక నివేదిక ప్రకారం రోజుకు త్రాగాల్సిన నీటి పరిమాణం ఇలా ఉంది.
ఏ వయస్సువారు ఎంత నీరు తాగాలి..?
పిల్లలకు (6 నెలల నుంచి 18 సంవత్సరాల వరకు)
- 0–6 నెలలు: తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. అదనంగా నీరు అవసరం లేదు.
- 1–3 సంవత్సరాలు: సుమారు 1 లీటర్ (ఆహారంలో ఉండే నీటితో కలిపి)
- 4–8 సంవత్సరాలు: సుమారు 1.2 లీటర్లు
- 9–13 సంవత్సరాలు (బాలికలు): 1.4 లీటర్లు
- 9–13 సంవత్సరాలు (బాలురు): 1.6 లీటర్లు
- 14–18 సంవత్సరాలు (బాలికలు): 1.6 లీటర్లు
- 14–18 సంవత్సరాలు (బాలురు): 1.9 లీటర్లు
పెద్దలకు (19 సంవత్సరాల పైబడిన వారికి)
వయస్సు పెరిగే కొద్దీ దాహాన్ని గుర్తించే శక్తి కొంత తగ్గుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా నీరు త్రాగడం చాలా ముఖ్యం.
- మహిళలు: రోజుకు సగటున 2.1 లీటర్లు
- పురుషులు: రోజుకు సగటున 2.6 లీటర్లు
ప్రత్యేక శ్రద్ధ అవసరమైనవారు
- గర్భిణీ స్త్రీలు: రోజుకు సుమారు 3 లీటర్ల నీరు త్రాగడం మంచిది.
- తల్లిపాలు ఇచ్చే తల్లులు: రోజుకు దాదాపు 3.1 లీటర్ల వరకు నీరు అవసరం కావచ్చు.
- వ్యాయామం చేసే వారు, అథ్లెట్లు: తీవ్రంగా వ్యాయామం చేసే సమయంలో ప్రతి అరగంటకు అదనంగా నీరు త్రాగాలి.
మీరు తగినంత నీరు తాగుతున్నారా?
డీహైడ్రేషన్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి.
- మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే నీరు తక్కువగా తాగుతున్నట్టు అర్థం.
- లేత పసుపు లేదా పారదర్శక రంగు ఉంటే అది సరైన హైడ్రేషన్ సంకేతం.
- అధిక దాహం, అర్థం కాని అలసట, తలనొప్పి, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కూడా డీహైడ్రేషన్కు సంకేతాలుగా భావించాలి.
కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో తగినంత నీరు త్రాగడం అలవాటు చేసుకోవడం చాలా అవసరం.