
ఉద్యోగం కోసం చూస్తున్న మహిళలకు, సొంత కాళ్లపై నిలబడాలనుకునేవారికి కొత్త అవకాశంగా ఒక పథకం ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే LIC ప్రారంభించిన బీమా సఖి పథకం ద్వారా మహిళలు బీమా రంగంలో కెరీర్ను ప్రారంభించడంతో పాటు శిక్షణ కాలంలోనే నెలకు ఆదాయం సంపాదించే అవకాశం పొందుతున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం మహిళలను ఆర్థికంగా సాధికారంగా మార్చడం. ఇందులో ఎంపికైన మహిళలకు LIC ఏజెంట్లుగా పనిచేయడానికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా శిక్షణ సమయంలోనే వారికి నిర్దిష్టమైన నెలవారీ భత్యం ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
పథకం నిబంధనల ప్రకారం శిక్షణ పొందుతున్న మహిళలకు మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరంలో నెలకు రూ.6,000, మూడో సంవత్సరంలో నెలకు రూ.5,000 భత్యం అందుతుంది. శిక్షణ పూర్తయ్యాక వారు పూర్తి స్థాయి ఏజెంట్లుగా పనిచేస్తూ పాలసీలు విక్రయిస్తే, కమిషన్ రూపంలో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ఉన్న సాధారణ మహిళలు సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. విద్యార్హత విషయంలో కూడా పెద్దగా అడ్డంకులు లేవు. గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉండటంతో చాలా మంది మహిళలు ఇందులో పాల్గొనవచ్చు. అయితే ఇప్పటికే LICలో ఉద్యోగిగా లేదా ఏజెంట్గా పనిచేస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కారు.
దరఖాస్తు ప్రక్రియను కూడా LIC సులభతరం చేసింది. మహిళలు తమ సమీపంలోని LIC కార్యాలయాన్ని సందర్శించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. LIC అధికారిక వెబ్సైట్లో Bima Sakhi ఎంపికపై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపాలి. 10వ తరగతి సర్టిఫికేట్, వయస్సు రుజువు, నివాస రుజువు వంటి పత్రాలను సమర్పించి ఫారమ్ను పూర్తి చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి