
మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. జీవితం ప్రారంభమైనట్లే ఒక దశలో ముగుస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. వైద్య శాస్త్రం ప్రకారం మరణానికి కొన్ని రకాలు ఉంటాయి. అలాగే మరణానికి ముందు మన శరీరంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రాణం పోయే ముందు మనిషికి కలిగే అనుభూతులు ఏమిటి? అనే విషయాలపై మన పురాణాలు, ముఖ్యంగా గరుడ పురాణం అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
మరణంలో రకాలు: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
కాల మరణం: మనిషి తన నిర్దేశిత ఆయుష్షును పూర్తి చేసుకుని, వృద్ధాప్యం లేదా సహజ కారణాలతో మరణించడాన్ని కాల మరణం అంటారు.
అకాల మరణం: ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు లేదా అనారోగ్యం కారణంగా ఆయుష్షు తీరకుండానే సంభవించే మరణాన్ని అకాల మరణం అంటారు. అకాల మరణం చెందిన ఆత్మలు త్వరగా మోక్షాన్ని పొందవని, ప్రేత రూపంలో తిరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
మరణానికి ముందు జరిగే మార్పులు: మరణం సంభవించే కొద్ది నిమిషాల ముందు మనిషిలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. చూపు మందగించడం, మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. గరుడ పురాణం ప్రకారం, మరణించే వ్యక్తికి తన పూర్వీకులు లేదా యమదూతలు కనిపిస్తారు. చేసిన పుణ్యకార్యాల బట్టి కొందరికి దేవదూతలు కనిపిస్తే, పాపాలు చేసిన వారికి భయంకరమైన రూపాలు కనిపిస్తాయని చెప్పబడింది.
కర్మఫలం – యమలోక ప్రయాణం: ప్రాణం శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ప్రయాణం ఆ వ్యక్తి చేసిన ‘కర్మ’పై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేసిన ఆత్మలు ప్రశాంతంగా వెళ్తాయి. కానీ పాపాలు చేసిన వారు యమదూతల ద్వారా చిత్రహింసలకు గురవుతూ యమపురికి చేరుకుంటారని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలు (పిండ ప్రధానం వంటివి) ఆత్మకు ఊరటనిస్తాయని భక్తుల నమ్మకం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..