
దేశ విదేశాల్లో తెలుగు వాళ్లు ఎక్కడున్నా మార్చి నెల రాగానే మామిడి కాయలే గుర్తొస్తాయి. తెలుగు వాళ్లే కాదు.. విదేశీయులు కూడా మన మ్యాంగోల కోసం ఎదురు చూడాల్సిందే..! ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి ప్రతి ఏటా విదేశాలకు టన్నుల కొద్దీ మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. అందులోనూ.. కృష్ణా జిల్లా నూజివీడు మామిడికి ఫుల్ డిమాండ్.. నూజివీడు రసాలు పేరు చెప్తే నోరూరాల్సిందే.. అందుకే.. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు మన మామిడి ఎగుమతి అవుతుంది. దేశ విదేశాల్లోనూ మన మామిడి మస్తు గిరాకీ ఉండడంతో వ్యాపారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. అయితే.. ఇదంతా గతేడాది వరకు.. ఇప్పుడు సీన్ మారిపోయింది. నూజివీడు మామిడి దిగుబడి భారీగా వచ్చే అవకాశం ఉన్నా.. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వార్ కారణంగా ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వాస్తవానికి.. ఎగుమతి దారులకు ఈసారి ఆర్డర్స్ భారీగా ఉన్నాయి. కానీ.. ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. మామిడి ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు మామిడి పండ్లు ఎక్కువగా ఆకాశ మార్గంలోనే ఎగుమతి అవుతుంటాయి. కానీ.. యుద్ధం కారణంగా ఇప్పటికే.. కొన్ని ఫ్లైట్స్ రద్దు కావటం, కొన్ని ఎయిర్వేస్లు ఛార్జీలు పెంచడం లాంటి పరిణామాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఆయా దేశాల్లో మామిడికి భారీగా డిమాండ్ ఉన్నా.. దానికి తగ్గట్టుగా ఎగుమతి చేయలేకపోతున్నామని ముంబైకి చెందిన ఎక్స్పోర్ట్ నిర్వాహకులు సమీర్ చెప్తున్నారు.
వార్ ఎఫెక్ట్ నూజివీడు మామిడికి ఇబ్బందులు తెచ్చి పెడితే.. మహబూబ్నగర్ జిల్లా మామిడి రైతులను తెగుళ్లు సర్వనాశనం చేస్తున్నాయి. తీపి ఫలాలు పండించే కొల్లాపూర్ మామిడి రైతులకు నాలుగేళ్లుగా చేదు ఫలాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం, పలు రకాల తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కాయలతో నిండుగా కనిపించాల్సిన మామిడి చెట్లు.. వాడిపోయిన పూతలతో దర్శనమిస్తున్నాయి. ఎకరాలకు ఎకరాలు కాత, పూత లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లక్షల పెట్టుబడితో ఏడాదంతా సాగు చేస్తే.. చివరికి చీడ, పీడలతో కూడిన చెట్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే కొల్లాపూర్ మామిడికి ప్రతి ఏటా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది సుమారు 35వేల ఎకరాల్లో మామిడి పంట పండింది. నేల స్వభావం, నీటి లక్షణాలతో కొల్లాపూర్ మామిడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశీయంగా ఎంతో గుర్తింపు ఉన్న కొల్లాపూర్ మామిడి.. అమెరికా, మలేషియా, అరబ్, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా కొల్లాపూర్ మామిడి రైతులను తెగుళ్ల కష్టాలు వెంటాడుతున్నాయి. నల్లతామర, తేనేమంచు, బూడిద తెగుళ్లు మామిడి పూతను పట్టి పీడిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పూత, కాత దెబ్బ తినడం మామిడి రైతులకు ఇబ్బందిగా మారింది.
మొత్తంగా.. ఒకవైపు.. కృష్ణా జిల్లా నూజివీడు మామిడికి ఇజ్రాయెల్-ఇరాన్ వార్ శనిలా మారితే.. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మామిడిని తెగుళ్లు, వాతావరణ మార్పులు పట్టి పీడిస్తు్న్నాయి. ఫలితంగా.. మామిడి రైతులను ఆదుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..