
భారత రాజకీయ-మీడియా వర్గాల్లో ఇటీవలి రోజుల్లో ఒక ఆసక్తికర కథనం చర్చకు వస్తోంది. అమెరికా సుంకాల ఒత్తిడిని కొంత తగ్గించి, రష్యా చమురు కొనుగోలుకు తాత్కాలిక అవకాశం కల్పించిందనే వార్తల తర్వాత.. భారత్ రష్యా నుంచి చమురు కొనాలంటే వాషింగ్టన్ అనుమతి కావాలనే వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదన వాస్తవ దూరమైనది. అంతేకాదు.. మీరు దీన్ని నమ్మితే భారత్ అనుసరిస్తున్న ఇంధన విధానాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నట్టే.
రష్యానే అతిపెద్ద సప్లయర్..
2026 ఫిబ్రవరి నాటికి భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యానే కొనసాగుతోంది. భారత రిఫైనరీలు రోజుకు సుమారు 10 లక్షల నుంచి 17 లక్షల బ్యారెల్ల వరకు రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం. అంటే నెలకు సుమారు 28 నుంచి 48 మిలియన్ బ్యారెల్లు రష్యా నుంచి భారత్కు చేరుతున్నాయి. ఈ లెక్కలే ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. భారత్ నిజంగా అమెరికా అనుమతితోనే రష్యా చమురు కొనుగోలు చేస్తుంటే… ఇంత భారీ స్థాయిలో దిగుమతులు కొనసాగేవి కావు.
ఇంధన భద్రతే ప్రథమ ప్రాధాన్యం
1.4 బిలియన్ జనాభా ఉన్న దేశానికి ఇంధన భద్రత అత్యంత కీలకం. భారత్ తన అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువ ముడి చమురు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందుకే ధరలు, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, దేశీయ ద్రవ్యోల్బణం వంటి అంశాలను సమతుల్యం చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రవాణా ఖర్చు, తయారీ వ్యయం, విద్యుత్ ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది. చివరికి మధ్యతరగతి కుటుంబాల ఖర్చులను కూడా అది ప్రభావితం చేస్తుంది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మారిన వ్యూహం
2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ తన ఇంధన సరఫరా వనరులను విస్తరించింది. తక్కువ ధరకు, పెద్ద పరిమాణాల్లో లభించిన రష్యా చమురు భారత రిఫైనరీలకు ఆకర్షణీయంగా మారింది. వినియోగదారులను అంతర్జాతీయ ధరల షాక్ల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఆ వ్యూహానికి మద్దతు ఇచ్చింది. ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది.
చర్చలు వేరు… అనుమతులు వేరు
భారత్ అమెరికాతో చర్చలు జరపడం సహజమే. అలాగే రష్యా, గల్ఫ్ దేశాలు, ఇతర సరఫరాదారులతో కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద దేశాల మధ్య వాణిజ్య చర్చలు, సుంకాలపై చర్చలు సాధారణమే. కానీ వాటిని అనుమతిగా భావించడం వాస్తవానికి విరుద్ధం.
భారత వైఖరి స్పష్టం
తమ ఇంధన కొనుగోళ్లు మార్కెట్ పరిస్థితులు మరియు జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి అని న్యూఢిల్లీ పలుమార్లు స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ… భారత్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయలేదు. బదులుగా ఇతర దేశాల నుంచి కూడా సరఫరాలను విస్తరించే వ్యూహాన్ని కొనసాగించింది. ఇది లొంగుబాటు కాదు.. వ్యూహాత్మక స్వాతంత్ర్యం.
ప్రపంచ ఉద్రిక్తతల మధ్య కీలక నిర్ణయాలు
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఖతార్ కూడా తాత్కాలికంగా గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఇలాంటి సమయంలో బాధ్యతగల ప్రభుత్వం సరఫరా మార్గాలను తగ్గించదు… మరింత విస్తరిస్తుంది. అందుకే భారత చమురు విధానం ఎలాంటి సిద్ధాంతాలకు బంధించబడినది కాదు. అది వ్యావహారికం, స్వతంత్రం, ఆర్థిక అవసరాలపై ఆధారపడినది. భారత్ లాంటి పెద్ద దేశం తన ఇంధన నిర్ణయాలను ఇతర దేశాలకు అప్పగించదు. అవసరమైన చోట చర్చలు జరుపుతుంది.. సరఫరాలను విస్తరిస్తుంది.. ప్రజలకు అత్యుత్తమ ఒప్పందాన్ని సాధిస్తుంది. ఇప్పుడూ భారత్ చేస్తున్నది అదే.