బంగారం ధర ఒకవైపు పెరుగుతుంటే.. అంతే స్థాయిలో గోల్డ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి.. ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బంగారు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. తీరా వారు విషయం తెలుసుకునే లోపు ఆ వ్యాపారులు నిలువునా ముంచి ఉడాయిస్తున్నారు. ఇలా అమాయక ప్రజలనే కాక, తోటి వ్యాపారులను కూడా నమ్మించి మోసం చేస్తూ ఉడాయించిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వరుసగా బంగారు వ్యాపారులు కోట్లలో ఐపీ పెట్టి రాత్రికి రాత్రి ఊరు వదిలి చెక్కేసిన ఘటనలు తీవ్ర కలకలంగా మారాయి. స్థానిక షరాఫ్ బజార్ కు చెందిన ఓ వ్యాపారి, మరో తయారీదారుడు వారం వ్యవధిలో దుకాణాల బోర్డులను తిప్పేశారు. అంతేకాదు నివాస గృహాలను సైతం ఖాళీ చేసి పలాయనం చిత్తగించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వీరిద్దరూ కలిసి దాదాపు రూ.6 కోట్ల దాకా కుచ్చుటోపి పెట్టినట్లు సమాచారం.
ఆభరణాలను ఆర్డర్ పై చేయించడంతో పాటు నగలు కుదువ పెట్టుకుని అప్పులు ఇచ్చే ఓ వ్యాపారస్తుడు రూ.3 కోట్ల దాకా మోసానికి పాల్పడ్డాడు. అలాగే బంగారు వ్యాపారులు, వినియోగదారులు తెచ్చి ఇచ్చే బంగారుతో నగలను తయారు చేయించే తయారిదారుడు కూడా రూ.3 కోట్లు విలువ చేసే బంగారు అభరణాలు తీసుకుని ఉడాయించాడు. తెల్లారేసరికల్లా దుకాణాలు మూసి ఉండటంతో కంగారుపడ్డ వినియోగదారులంతా కలిసి దుకాణం ముందు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పలువురు బాధితులు జిల్లా పోలీస్ సూపరిండెంట్, స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
అయితే బాధితుల వద్ద సరైనా ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట. బంగారు వ్యాపారుల మోసాలు బయటకు పొక్కడంతో ఇతర వ్యాపారులను నమ్మలావద్దా? అన్న సంగదిద్ధంతో వినియోగదారులు కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు స్పందించి వ్యాపారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..