పేరుకు జాతీయ ప్రాజెక్.. కష్టాల్లో కామధేను.. నోరులేని మూగ జీవుల గోస తీర్చేదేవరు..?

పేరుకు జాతీయ ప్రాజెక్.. కష్టాల్లో కామధేను.. నోరులేని మూగ జీవుల గోస తీర్చేదేవరు..?


నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవిలోని పశుగణాభివృద్ధి క్షేత్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం ప్రస్తుతం నీటి సమస్య, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్వదేశీ జాతి గోవులు, గేదెల అభివృద్ధి లక్ష్యంగా 2015లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అదే ఏడాది బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించినప్పటికీ, ప్రారంభ దశలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు మొదలయ్యాయి.

దేశంలో రెండవదిగా, దక్షిణ భారతదేశంలో మొదటిదిగా స్థాపించిన ఈ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక పాలు ఇచ్చే స్వదేశీ జాతి గోవులు, గేదెలను తీసుకువచ్చి, వాటి వీర్యాన్ని సేకరించి కృత్రిమ గర్భాధానం ద్వారా స్థానిక పశువుల నాణ్యతను పెంచాలన్నది ప్రధాన ఉద్దేశం. రైతులకు తక్కువ ధరలో మెరుగైన జాతి దూడలను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

అయితే మౌలిక సదుపాయాల కోసం నిధుల విడుదలలో నిర్లక్ష్యం కారణంగా సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా నీటి కొరత తీవ్రంగా ఉంది. కేంద్రంలో ఉన్న బోర్లు పశువుల అవసరాలకు సరిపోవడం లేదు. సమీపంలో సోమశిల ఉత్తర కాలువ ఉన్నా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో 500 ఎకరాల పశుగ్రాస భూమిని పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్నారు. ఫలితంగా బహువార్షిక పశుగ్రాసం సాగు సాధ్యం కాక, ఏకవార్షిక పశుగ్రాసంపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక వెటర్నరీ అసిస్టెంట్ల కొరత కూడా పశువుల సంరక్షణపై ప్రభావం చూపుతోంది. గతంలో రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు ప్రతిపాదించినా నిధులు కొరతతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అనంతరం మరలా మూడు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ముద్దుపాడు నుంచి పైప్ లైన్ ల ద్వారా నీటిని అందించాలని ప్రతిపాదన సిద్ధం చేసినా అవి కూడా అరకురా పనులతో మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఉప్పుటేరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుపుతున్నారు.

గత ఏడాది వర్షాలు బాగా కురవడంతో కొంతవరకు నీటి సమస్య లేకపోయినప్పటికీ వేసవి కాలం సమీపిస్తుందంటూ ఆవులకు గేదెలకు గొర్రెలకు తాగేందుకు నీరు సరిపోతుందో లేదు కానీ ముఖ్యంగా పసుగ్రాసం ఉత్పత్తికి మాత్రం ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది.

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయడం, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగితేనే ఈ జాతీయ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన నిధులు విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *