‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై NCERT 8వ తరగతి టెక్ట్స్ బుక్‌లో పాఠం.. సుప్రీంకోర్టు సీరియస్

‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై NCERT 8వ తరగతి టెక్ట్స్ బుక్‌లో పాఠం.. సుప్రీంకోర్టు సీరియస్


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి కొత్త పాఠ్యపుస్తకంలోని సిలబస్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ బుధవారం (ఫిబ్రవరి 25) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ గురించి ప్రస్తావించే పాఠ్య భాగాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కించపరచడానికి ఎవరినీ అనుమతించబోమని CJI సూర్యకాంత్ అన్నారు. బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎత్తి చూపారు. NCERT 8వ తరగతి సోషల్ సైన్సెస్‌ పార్ట్‌ 2 కొత్త పాఠ్యపుస్తకంలో ప్రచురించిన ‘corruption in the judiciary’ విభాగం కంటెంట్‌పై సుమోటో కేసుకు ఆదేశించామన్నారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి ఈ అంశాన్ని CJI ముందు ప్రస్తావించారు. న్యాయస్థానాల్లో అవినీతి, పెండింగ్‌ కేసులు, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలతో కొత్త పుస్తకం రూపొందించారని సీజేఐ ముందు ప్రస్తావించారు. దీంతో న్యాయవ్యవస్థ అవినీతిమయమైందని 8వ తరగతి విద్యార్థులకు బోధించడం పట్ల సీజేఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బార్‌ తరపున మాట్లాడుతున్నానని, సిబల్‌ ధర్మాసనం ఈ విషయాన్ని స్వయంగా పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు.

ఇక్కడ సమస్య కంటెంట్‌ కాదు. సెలక్టివిటీ. ఇది సెలెక్టివ్‌ చిత్రణ కేసు అని సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి ఇలా అన్నారు. ఇది మొత్తం న్యాయవ్యవస్థకు సంబంధించింది. బార్ బెంచ్‌లోని ప్రతి ఒక్కరూ కలత చెందే విషయం ఇది. కొన్ని రోజులు ఆగండి. దీనిపై సుమోటోగా విచారణ స్వీకరిస్తాం. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు కించపరిచేందుకు ఎవరినీ అనుమతించబోం. సంస్థ అధిపతిగా, నేను నా విధిని నిర్వర్తిస్తాను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. NCERT 8వ తరగతి విద్యార్థులకు న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. అవినీతి ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉందా? ఇంకా ఏ వ్యవస్థలోనూ లేదా?. ఇటువంటి బోధనల వలన విద్యార్ధుల్లో న్యాయవ్యవస్థపై గౌరవం పోతుందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూమోటోగా వెంటనే స్వీకరించాలని సిబల్‌ కోరగా సీజేఐ ఈ ఒక్కరోజు ఆగండి అని అన్నారు.

అసలు 8వ తరగతి కొత్త టెక్ట్స్ బుక్‌ చాప్టర్‌లో ఏముంది?

న్యాయవ్యవస్థలో అవినీతి అనే చాప్టర్‌లో.. న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి, తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు, పేలవమైన మౌలిక సదుపాయాలు వంటి పలు అంశాలను ఆ చాప్టర్‌లో ఉన్నాయి. కొత్త పుస్తకంలోని సదరు చాప్టర్‌లో సుప్రీంకోర్టులో 81,000, హైకోర్టులు 62,40,000, జిల్లా – సబార్డినేట్ కోర్టులలో 4,70,00,000 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రస్తావించింది. న్యాయమూర్తుల ప్రవర్తన కోర్టు గదిలో మాత్రమే కాకుండా కోర్టు వెలుపల కూడా వారి ప్రవర్తనను నియంత్రించే నియమావళి ద్వారా పాలించబడతారని ఇందులో ఎత్తి చూపింది. జవాబుదారీతనం కొనసాగించడానికి న్యాయవ్యవస్థ అంతర్గత యంత్రాంగం, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) ద్వారా ఫిర్యాదులను స్వీకరించడానికి ఏర్పాటు చేయబడిన విధానం గురించి ఇది పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఎన్‌సీఈఆర్‌టీ యూటర్న్‌..!

NCERT 8వ తరగతి కంటెంట్‌పై దేశ వ్యాప్తంగా హైకోర్టుల జడ్జీలు, న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్‌సీఈఆర్‌టీ వెనక్కితగ్గింది. తమ వెబ్‌సైట్‌ నుంచి వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. పాఠ్యపుస్తకాల్లోనూ వివాదాస్పద అంశాలను తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే పుస్తకాల ముద్రణ పూర్తవడంతో వాటిని సైతం తొలగించి మళ్లీ కొత్తగా ముద్రించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్‌ దినేశ్‌ ప్రసాద్‌ సాక్లానీ దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *