
కృష్ణా నదీ తీరాన విజయకీలాద్రిపై ‘శ్రీవిఘ్నవిమోచక హనుమాన్’ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేళయింది. 27 అడుగుల హనుమాన్ మహా విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాన్ని కనులరా చూద్దాం.. మనసారా తరిద్దాం అంటూ భక్తకోటి విజయకీలాద్రికి కృష్ణా తరంగాల్లా తరలి వస్తున్నారు. మూడు రోజులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
విజయవాడలోని విజయకీలాద్రిపై శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాణప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా నేడు ఆదివారం (మార్చి 08) చతుస్థానార్చన, మన్యుసూక్త హవనం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు స్వాతీ నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి కరకమలాలతో శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్టి, విశేష తదీయారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విజయకీలాద్రికి చేరుకుంటున్నారు.
మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి పర్యవేక్షణలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాలు, హోమాలు, మన్యుసూక్త హవనం, మూలమంత్ర హవనం, తత్త్వన్యాస హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి వైభవాన్ని వివరించేలా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు ప్రత్యేక ప్రవచనాలు అందించారు. పూజా కార్యక్రమంలో మైహోమ్ సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉత్తర దిశలో యోగాంజనేయుడు, దక్షిణ దిశలో అభయాంజనేయుడు రూపాలలో ఈ క్షేత్రాన్ని హనుమంతుడు కాపాడుతున్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. 27 అడుగుల ఎత్తుతో కొలువుదీరుతున్న ఈ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠతో భక్తుల జీవితాల్లోని విఘ్నాలు తొలగి ప్రతి ఒక్కరికి ధైర్యం, మనోబలం లభించడంతో పాటు విజయకీలాద్రి క్షేత్రం మరింత వైభవంగా వెలుగొందుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుందని ఆధ్యాత్మిక వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..