ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శత్రుదేశాలకు ఎలా టార్గెట్ అయ్యారు? అత్యాధునిక భద్రత ఉన్నా ఇజ్రాయెల్ క్షిపణులు ఆయనను ఎలా వెతుక్కుంటూ వెళ్లాయి? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సంచలన సమాధానాలు దొరుకుతున్నాయి. ఖమేనీ నివాసం ఉండే కాంపౌండ్ నుంచి ఆయన వాడే కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరకు ప్రతిదీ ఏళ్ల తరబడి ఇజ్రాయెల్ నిఘా నీడలోనే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ను, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను ఇజ్రాయెల్ నిఘా విభాగం చాలా కాలం క్రితమే హ్యాక్ చేసింది. ఖమేనీ భద్రతా సిబ్బంది వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తారు? ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎవరిని కలుస్తారు? ఇలా ప్రతి కదలికను ఏళ్లపాటు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్ ద్వారా నిశితంగా గమనించింది.
అంతా 60 సెకన్లలోనే..
“మాకు మా సొంత నగరం జెరూసలేం గురించి ఎంత తెలుసో.. టెహ్రాన్ గల్లీల గురించి కూడా అంతే తెలుసు” అని ఇజ్రాయెల్ అధికారులు గర్వంగా చెబుతున్నారంటే నిఘా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్లో శనివారం పనిదినం. ప్రతి శనివారం ఖమేనీ తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ముందే తెలుసుకున్న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు.. ఫిబ్రవరి 28న ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన పక్కా సమాచారంతో కేవలం 60 సెకన్లలోనే ఖమేనీతో పాటు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక నాయకత్వాన్ని ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ తీసింది.g
ఖర్చులోనూ అగ్రరాజ్యమే
ఈ యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. గణాంకాల ప్రకారం.. ఆపరేషన్ మొదలైన మొదటి రోజే అమెరికా దాదాపు 779 మిలియన్ డాలర్లు అంటే రూ. 7,000 కోట్లు ఖర్చు చేసింది. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి భారీ యుద్ధ నౌకల నిర్వహణకే రోజుకు రూ. 59 కోట్లు ఖర్చవుతోంది. బలగాల మోహరింపు కోసం అదనంగా మరో రూ.5,700 కోట్లు వెచ్చించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఆయుధాల కొరత.. అమెరికాకు కొత్త చిక్కు
డబ్బు కంటే కూడా అమెరికాను ఇప్పుడు ఆయుధాల నష్టం కలవరపెడుతోంది. దాడుల క్రమంలో కువైట్లో మూడు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఉక్రెయిన్, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఇప్పటికే తన ఆయుధ వ్యవస్థలను మోహరించిన అమెరికాకు, ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే క్షిపణి రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇరాన్ పట్ల రష్యా, చైనా వంటి దేశాలు కేవలం ఖండనలకే పరిమితం కావడం ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఈ యుద్ధం మరో నాలుగు వారాలు కొనసాగితే మధ్యప్రాచ్య పటమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది.