యూపీలోని ఉన్నావ్ జిల్లా లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా నుండి లక్నోకు వెళ్తున్న ఓ కారు.. ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి మరొక లైన్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ క్రమంలో రోడ్డుపై పనిచేస్తున్న యుపిడిఏ ఉద్యోగులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బెహ్తా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారుగా గుర్తించారు.
ఉన్నావ్ జిల్లాలోని బెహ్తా ముజావర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్చార్జ్ మున్నా సింగ్ మాట్లాడుతూ, హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారు అదుపు తప్పి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిందని అన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన కార్మికులు సమీప గ్రామాలకు చెందినవారని భావిస్తున్నారు.
స్థానిక గ్రామస్తులు, యుపిడిఎ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అంబులెన్స్ సహాయంతో గాయపడిన వారిని ఆరాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మరణించినవారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపారు. ప్రమాదం తర్వాత, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేను దిగ్బంధించారు. ట్రాఫిక్ జామ్ అనేక కిలోమీటర్ల వరకు విస్తరించింది. పోలీసు అధికారులు గ్రామస్తులను దిగ్బంధనను తొలగించమని ఒప్పించడానికి ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి
ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందగానే స్థానిక యంత్రాంగం, యుపిడిఎ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..