తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఏమాత్రం వదలడం లేదు.. గ్యాప్ల వారీగా విరుచుకుపడుతూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాయుగుండం ముప్పు ముంచుకొస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు సెప్టెంబర్ 25 గురువారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. ఎల్లుండికి వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత.. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్పై వారం రోజుల పాటు వాయుగుండం ప్రభావం కొనసాగనుంది. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక.. ఇవాళ, రేపు బుధ, గురువారం కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు.. సెప్టెంబర్ 26న ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని వాయుగుండం.. తెలంగాణలోనూ ప్రభావం చూపించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా.. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 26న తెలంగాణలోని 18 జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 20 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లా్ల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..