అదో సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. చెవికి వినిపించదు. అసలు దాని ఉనికే మనిషికి తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన శరీరంలోకి దూరి, మన మెదడులోకి ప్రవేశించి..కొంచెం కొంచెంగా మన బ్రెయిన్ను తినేస్తుంది. కొన్నిరోజుల్లోనే మనల్ని చంపేస్తుంది. అంతటి డేంజర్ క్రిమి..ఇప్పుడు మన దేశాన్ని భయపెడుతోంది. అదే అమీబా. ఇప్పుడది కేరళను వణికిస్తోంది.
మెదడును తినే పరాన్నజీవి అమీబా ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అరుదైన వ్యాధి. మూడు నెలల శిశువు నుంచి 52 ఏళ్ల వ్యక్తి దాకా ఇలా 70 మంది ప్రాణాలను బలిగొంది. ఆగస్టు నెల కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతోనే బాలిక చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఒక్కరితో మొదలైన వ్యాధి..70దాకా చేరింది. తాజాగా త్రిస్సూర్లోని చావక్కాడ్కు చెందిన రహీం (59). కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కోజికోడ్ MCHలో అమీబిక్ మెనింగో బారినపడి ప్రస్తుతం మరో తొమ్మిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు నిర్ధారించారు.
ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ చాలా అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 500 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్క కేరళలోనే 120 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఈ సంవత్సరం 70 కేసులు నమోదయ్యాయి. కలుషితమైన మంచినీటిని పీల్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. దీనివల్ల అమీబా సైనస్ల ద్వారా మెదడుకు ప్రయాణించి కణజాలాన్ని నాశనం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
మొత్తం ఐదు దశల్లో మనిషి మెదడులోకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ప్రవేశిస్తుంది.
మొదటి దశ.. సిస్ట్..
అంటే నిద్రాణ దశ. వెచ్చని కొలనులు, స్విమ్మింగ్ పూల్లాంటి వాటిల్లో వృద్ధి చెందుతుంది. ఈ దశలో తిత్తి రూపంలో అంటే ఓసంచిగా ఉంటుంది. సిస్ట్ దశలో అమీబా గట్టి రక్షణ గోడను ఏర్పరచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది.
రెండో దశ ట్రోఫోజోయిట్:
ఇది అమీబా సంక్రమణ దశ అంటారు. అంటే ఆహారం తీసుకునే దశ. వెచ్చని తాజా నీటి వాతావరణంలో సరస్సులు, నదులు, కొలనుల్లో అమీబా స్వేచ్ఛగా అమీబా కుదులుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులను తిని జీవిస్తుంది.
మానవులలో సంక్రమణకు కారణమయ్యే దశ ఇదే. ఈ దశలో అమీబా విభజన ద్వారా పునరుత్పత్తి చేస్తుంది.
మూడో దశ ఫ్లాజెల్లేట్ (ఈత కొట్టే దశ):
పర్యావరణంలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు లేదా నీటి పరిస్థితులు మారినప్పుడు అమీబా ఈ దశకు రూపాంతరం చెందుతుంది. ఈ దశలో అమీబాకు రెండు ఫ్లాజెల్లా.. చలనానికి సహాయపడే తోకలాంటి నిర్మాణాలు) ఏర్పడతాయి, దీనితో నీటిలో స్వేచ్చగా ఈత కొడుతుంటుంది. ఈ దశ తాత్కాలికమైనది, అనుకూల పరిస్థితులు తిరిగి లభిస్తే ట్రోఫోజోయిట్ దశకు తిరిగి మారుతుంది.
నాలుగో స్టేజ్:
మనిషి మెదడులోకి అమీబా ప్రవేశించే ప్రక్రియ అంటే. చెరువులు, ఈతకొలనులు, అమీబా ఉన్న ప్లేసులో మనిషి ఈతకొట్టడం, నీటిలో మునిగితే ముక్కులో నుంచి అమీబా మన మెదడులోకి వెళ్తుంది.
ఐదో స్టేజ్:
మనిషి మెదడులోకి ప్రవేశించి మన నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతాడు. ఇంతటి డేంజర్ ఫంగస్ మనలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. శుబ్రంగా లేని ఈతకొలనుల్లో అస్సలు దిగకూడదు. ఒక వేళ దిగినా తల మాత్రం ముంచకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సో.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటున్నారు వైద్యులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..