
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారత ఎగుమతులపై కూడా పడుతోంది. ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన అనేక కార్గో షిప్మెంట్లు నిలిచిపోవడంతో ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రధాన ఓడరేవులకు కీలక సూచనలు జారీ చేసింది. దేశంలోని 12 ప్రధాన పోర్టులను నిలిచిపోయిన షిప్మెంట్లపై విధించే కొన్ని రుసుములను తగ్గించడం లేదా పూర్తిగా మాఫీ చేయడం గురించి ఆలోచించాలని కోరింది.
నివేదికల ప్రకారం.. నిల్వ అద్దె, రీఫర్ ప్లగ్గింగ్ ఫీజులు (కోల్డ్ కంటైనర్ ఛార్జీలు), షిప్ మార్పిడి ఖర్చులు వంటి రుసుములను తగ్గించడం లేదా మాఫీ చేయాలని పోర్టు అధికారులకు సూచించారు. పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన వర్చువల్ సమావేశం తర్వాత షిప్పింగ్ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రస్తుత సంక్షోభ సమయంలో పోర్టులు అదనపు రుసుములు విధించకూడదని తెలిపారు. పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన సరుకును తాత్కాలికంగా ట్రాన్స్షిప్మెంట్ సరుకుగా పోర్టుల్లో నిల్వ ఉంచేందుకు అనుమతించాలని కూడా సూచించారు. అవసరమైతే అదనపు నిల్వ స్థలాన్ని కూడా అందించాలని పోర్టులకు ఆదేశించారు.
ఇంకా పోర్టుల్లో ఇప్పటికే ఉన్న ఎగుమతి సరుకును అవసరమైతే కస్టమ్స్ అధికారులతో సమన్వయం చేసుకుని దేశీయ మార్కెట్కు తిరిగి పంపే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం పోర్టు అధికారులకు మరో ముఖ్య సూచన చేసింది. పాడైపోయే ఆహార పదార్థాలు లేదా ఇతర సరుకులు చెడిపోకుండా వాటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. అలాగే ఓడలకు అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా బంకరింగ్ సామర్థ్యాన్ని పెంచాలని కూడా సూచించింది. షిప్పింగ్ కంపెనీలు, ఎగుమతిదారులు రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో పోర్టుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కంటైనర్లు, సరుకు రవాణా చేసే ఓడల కొరత కూడా ఏర్పడవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు విదేశీ జెండాలు కలిగిన మరిన్ని ఓడలను దేశీయ సరుకును తీసుకెళ్లడానికి అనుమతించాలని కూడా సమావేశంలో సిఫార్సు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి