
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని జనవరి 12న ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒకేసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం రక్షణతో పాటు హామీ రాబడి పొందాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పాలసీదారుడు ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. నెలనెలా లేదా సంవత్సరానికి వాయిదాలు చెల్లించే అవసరం ఉండదు. రెగ్యులర్ ప్రీమియంలు చెల్లించడం కష్టంగా భావించే వారు, ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత స్థిరమైన భద్రత కోరుకునే వారికి ఇది అనుకూల ఎంపికగా భావిస్తున్నారు.
పాలసీ అమల్లో ఉన్నంత కాలం బీమా కవరేజ్ కొనసాగుతుంది. పాలసీదారునికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కుటుంబానికి నిర్ణయించిన బీమా మొత్తం అందుతుంది. ఈ పథకం నాన్-లింక్డ్ ప్లాన్ కావడంతో స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. అందువల్ల రాబడి స్థిరంగా ఉండే అవకాశముందని బీమా నిపుణులు చెబుతున్నారు. పొదుపు, రక్షణ రెండింటినీ సమతుల్యం చేసే ఈ స్కీమ్ తక్కువ రిస్క్తో గ్యారంటీడ్ రిటర్న్ కోరుకునే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకునే కుటుంబాలకు ఇది ఒక సురక్షిత మార్గంగా భావిస్తున్నారు.
అలాగే గడువు ముగిసిన పాలసీలను పునరుద్ధరించేందుకు LIC ప్రత్యేక ప్రచారాన్ని కూడా కొనసాగిస్తోంది. మార్చి 2 వరకు కొనసాగే ఈ డ్రైవ్లో లింక్ చేయని పాలసీల పునరుద్ధరణపై ఆలస్య రుసుముల్లో 30 శాతం వరకు (గరిష్టంగా రూ.5,000) రాయితీ ఇవ్వబడుతోంది. సూక్ష్మ బీమా పథకాల విషయంలో ఆలస్య రుసుములను పూర్తిగా మాఫీ చేస్తున్నారు. ఒకేసారి పెట్టుబడితో జీవితకాల భద్రత కోరుకునే వారికి ఇది అనుకూల సమయంగా నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి