
ఇరాన్, అమెరికా-ఇజ్రయెల్ యుద్దం న్యూక్లియర్ వార్గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇరాన్లో భూకంపంపై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణు పరీక్షలు చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణు పరీక్షలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. రష్యా కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.
అమెరికా మాత్రం ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారీని 90 శాతం పూర్తి చేసినట్టు అనుమానిస్తోంది. మరికొన్ని వారాల్లో బాంబు తయారీని పూర్తి చేయాలన్న లక్ష్యంతో IRGC ధృడ సంకల్పంతో ఉన్నట్టు చెబుతున్నారు. భారత్లో ఇరాన్ రాయబారి మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. తాము ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయడం లేదన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం లేదని IAEA మరోసారి ప్రకటించింది. అణ్వాయుధాలను తయారు చేసే ఉద్దేశ్యం ఇరాన్కు లేదని పలుమార్లు ప్రకటించారు. కాని కొన్నిసార్లు ఈ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తారని ఆయన అన్నారు. మరోవైపు అమెరికా లోని నెవెడా అణు కేంద్రం దగ్గర కూడా భూ ప్రకంపనలు సంచలనం రేపాయి. అమెరికా కూడా అణుపరీక్షలు చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్తో యుద్దం వేళ మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ సర్కార్ పనిచేస్తునట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఇరాన్లోని మరో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఇరాన్లోని తీర ప్రాంత నగరం బుషెహర్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. నేవల్ బేస్ లక్ష్యంగా మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. న్యూక్లియర్ ప్లాంట్ పక్కనే ఉన్న నావెల్ బేస్ పోర్ట్ ధ్వంసమైంది. నావెల్ బేస్ పోర్ట్కు సమీపంలోనే రష్యా సహాయంతో నిర్మించిన బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ దాడులతో న్యూక్లియర్ ప్లాంట్కు ముప్పు పొంచి ఉంది. ఏ క్షణమైనా.. ఏమైనా జరిగే ప్రమాదం ఉండటంతో.. తక్షణమే సిబ్బందిని పవర్ ప్లాంట్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా రష్యా ఆదేశించింది. ఇరాన్ను సైతం రష్యా అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్లోని నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్పై ఇప్పటికే దాడి జరిగింది. ఇప్పుడు బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ప్రమాదపు అంచుల్లో ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..