తాజాగా, ఓ రైతు కోట్లు విలువ చేసే తిమింగలం వాంతిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కోటీశ్వరుడు కావాలన్న కోరిక నెరవేరకుండానే జైలు పాలయ్యాడు.ఈ సంఘటన గుజరాత్లో ఆలస్యంగా వెలుగు చూసింది. భావ్నగర్ జిల్లా, హతబ్ గ్రామానికి చెందిన విపుల్ భూపత్భాయ్ బంబానియా అనే రైతుకు నాలుగు నెలల క్రితం బీచ్ లో తిమింగలం వాంతి దొరికింది. అది అత్యంత ఖరీదైన అంబర్గ్రిస్ తిమింగలం వాంతి అని అతడు నిర్ధారించుకుని, దానిని ఇంటికి తరలించి.. స్థానికంగా అమ్మే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. అయితే, దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో తిమింగలం వాంతితో సూరత్ చేరుకొని, అక్కడ సంపన్న వ్యాపారులకు దానిని అమ్మచూపే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ది స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ సూరత్ అధికారులు పక్కా సమాచారంతో విపుల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 కిలోల అంబర్గ్రిస్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 5 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కింద అంబర్గ్రిస్ను అమ్మటం లేదా కొనడం చట్టరీత్యా నేరం. అంబర్గ్రిస్తో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :