ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. సమ్మర్ బెస్ట్ టిప్స్ ఇవే..

ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. సమ్మర్ బెస్ట్ టిప్స్ ఇవే..


తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది.. మున్ముందు ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు  పేర్కొంటున్నారు.  అయితే.. సహజంగా.. ఎండాకాలం ప్రారంభం కాగానే చాలా మందిని వేధించే సాధారణ సమస్య.. శరీరంలో వేడి చేసింది అని చెప్పడం. అయితే, శరీరంలో వేడి చేయడం అనేది ఒక రోగం కాదు.. ఇది ఒక్కొక్కరి శరీర తత్వానికి అనుగుణంగా స్వల్పంగా మారే బేసల్ బాడీ టెంపరేచర్ వల్ల కలిగే ఒక భావన మాత్రమే. కొందరి శరీరాలు సహజంగానే కొద్దిగా వేడిగా ఉంటాయి. వేడి చేయడం వల్ల జలుబు, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, మూత్రంలో మంట, చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మలబద్ధకం వంటి అనేక లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యలన్నింటినీ వాడుక భాషలో వేడి చేయడం అని వ్యవహరిస్తారని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎండాకాలంలో వేడిని తగ్గించుకునేందుకు.. కొన్ని టిప్స్ పాటించడం మంచిది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు..

శరీర వేడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారాలు:

శరీరాన్ని చల్లబరచడానికి ముఖ్యంగా ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి. ఒకేసారి కాకుండా తరచుగా, కొద్దికొద్దిగా నీటిని తీసుకోవడం మంచిది. కేవలం నీరే కాకుండా, శరీరానికి చలువ చేసే ద్రవాలను ఎంచుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజలు కలిపిన నిమ్మరసం, చెరుకు రసం వంటివి శరీర వేడిని తగ్గించి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి మలబద్ధకం, చర్మ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్లు వంటి వేడి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

కూరగాయల విషయానికి వస్తే, బీరకాయ, సొరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో కర్బూజ (షుగర్ శాతం తక్కువ), పుచ్చకాయ (నీటి శాతం అధికం) వంటివి వేడిని తగ్గించడానికి మంచివి. అధిక షుగర్ ఉండే పండ్లు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

నివారించాల్సిన ఆహారాలు, అలవాట్లు:

మనం తీసుకునే ఆహారం శరీర వేడిపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. నూనెలో బాగా వేయించిన ఆహారాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అత్యంత మసాలా పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి. ఇవి డీహైడ్రేషన్‌కు గురిచేసి శరీరంలో వేడిని పెంచుతాయి. కూల్ డ్రింక్స్ పేగుల pH సమతుల్యతను దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా నివారించాలి. వేడిని కలిగించే పదార్థాలలో పొగతాగడం (స్మోకింగ్), మద్యం సేవించడం (ఆల్కహాల్) ముఖ్యమైనవి. ఎండాకాలంలో వీటిని పూర్తిగా మానుకోవాలి.

సూర్యరశ్మి నుండి రక్షణ, ఇంటి చిట్కాలు:

మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో బయటకి వెళ్లకుండా ఉండాలి. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే గాగుల్స్, స్కార్ఫ్‌లు, క్యాప్‌లు, గొడుగులు వంటివి ఉపయోగించి సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోవాలి.

కొన్ని ఇంటి చిట్కాలు కూడా శరీర వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. అరికాళ్ళకు నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి శరీర వేడి తగ్గుతుంది. చర్మంపై దద్దుర్లు లేదా మొటిమలు వచ్చినప్పుడు, రసాయనాలు కలిసిన క్రీములకు బదులుగా చందనం (గంధం) పూతను సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్‌గా ఉపయోగించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మూత్రంలో విపరీతమైన మంట, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్లు, తట్టుకోలేనంత ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొన్నిసార్లు థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా శరీర వేడిని తట్టుకోలేకపోవడం, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉండటం జరుగుతుంది. కాబట్టి, పదేపదే వేడిని తట్టుకోలేకపోతుంటే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

చివరగా, ఫ్రిజ్ నీటి బదులు సాధారణ ఉష్ణోగ్రతలోని నీటిని లేదా మట్టి కుండలోని నీటిని తాగడం ద్వారా సహజసిద్ధమైన చల్లదనాన్ని పొందవచ్చు. మట్టి కుండలోని నీరు మినరల్స్‌ను కాపాడుతూ గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *