
ఉత్తర్ప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. 2013 ఆగస్టు 20న రాఖీ పండగ రోజు ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా.. అతడి హెల్త్ కండీషన్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు హరీశ్ను చూసుకుంటూ.. ఆర్థికంగా, మానసికంగా బాగా చితికిపోయారు. హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరీశ్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ శ్వాస కోసం , గాస్ట్రోస్టమీ ట్యూబ్ ఆహారం కోసం వాడుతున్నాడని తెలిపింది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఈ పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడా నిరాశే ఎదురైంది. హరీశ్ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి స్పష్టమైన నివేదికలు ఇవ్వడంతో.. వాటి ఆధారంగా మరోసారి వారు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హరీశ్ మెడికల్ రిపోర్ట్లను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి పాసివ్ యూతనేషియాకు అనుమతించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన తొలి కేసుగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :